Laxman on World Cup Team Selection: ఇలాగైతే సెలక్టర్లకు కష్టమే.. వరల్డ్కప్ టీమ్పై లక్ష్మణ్
07 October 2022, 17:05 IST
- Laxman on World Cup Team Selection: ఇలాగైతే సెలక్టర్లకు కష్టమే అంటున్నాడు టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్, ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్. వన్డే వరల్డ్కప్కు టీమ్ ఎంపికపై అతను ఈ కామెంట్స్ చేశాడు.
టీమిండియా తాత్కాలిక కెప్టెన్, కోచ్ లు శిఖర్ ధావన్, వీవీఎస్ లక్ష్మణ్
Laxman on World Cup Team Selection: ఇండియన్ క్రికెట్లో ఇప్పుడు ఓ కొత్త సమస్య బీసీసీఐని, సెలక్షన్ కమిటీని వేధిస్తోంది. ఒకేసారి రెండు ఇండియన్ టీమ్స్ రెండు వేర్వేరు సిరీస్లు ఆడుతున్నాయి. గతేడాది ఇండియన్ టీమ్ ఇంగ్లండ్లో ఉన్నప్పుడు మరో టీమ్ను శ్రీలంకకు పంపాలని నిర్ణయించినప్పటి నుంచీ ఇది కొనసాగుతోంది.
ఈ ఏడాది కూడా ఆ మధ్య ఐర్లాండ్లో ఒక టీమ్, ఇంగ్లండ్లో మరో టీమ్ ఉంది. ఇక ఇప్పుడు ఒక టీమ్ సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతుంటే, మరో టీమ్ టీ20 వరల్డ్కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లింది. ఒక నేషనల్ టీమ్ ఒకేసారి రెండేసి సిరీస్లు ఆడగలిగేంత మంది ప్లేయర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. నిజానికి ఇప్పుడు వన్డే సిరీస్లో చోటు ఆశించి అసంతృప్తికి గురైన వాళ్లు కూడా ఉన్నారు.
ఇప్పుడో టీమ్ను ఎంపిక చేయడం సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో తాత్కాలికంగా హెడ్ కోచ్గా సేవలందిస్తున్న ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు అందుబాటులో ఉన్న టాలెంటెడ్ ప్లేయర్స్ను చూస్తుంటే.. వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్కు టీమ్ ఎంపిక సెలక్టర్లకు పెద్ద సవాలే కానుందని అన్నాడు.
"మనకు మంచి ప్లేయర్స్ చాలా మందే ఉన్నారు. వాళ్లంతా సిరీస్ కోసం ఆసక్తిగా ఉన్నారు. వాళ్ల మధ్య పోటీ మంచిదే. మనకు అందుబాటులో ఉన్న టాలెంట్ను చూస్తే ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాని పరిస్థితి. 2023 వన్డే వరల్డ్కప్ కోసం సరైన టీమ్ను ఎంపిక చేయడం సెలక్టర్లకు కష్టమే" అని లక్ష్మణ్ స్టార్ స్పోర్ట్స్తో అన్నాడు.
"యువకులంతా బాగా ఆడుతున్నారు. ఒకసారి ప్రధాన ప్లేయర్స్ వస్తే తమకు పెద్దగా అవకాశాలు రావని వాళ్లకు తెలుసు. కానీ ఓ బలమైన టీమ్ను ఎంపిక చేసినప్పుడు సెలక్టర్ల దృష్టిలో ఉండటానికి ఇప్పుడు బాగా ఆడటం ముఖ్యం" అని లక్ష్మణ్ చెప్పాడు. రెగ్యులర్గా ఇండియన్ టీమ్లో ఉండే స్టార్ ప్లేయర్స్ ఎవరూ లేకపోయినా కూడా తొలి వన్డేలో సౌతాఫ్రికాను సమర్థంగా ఎదుర్కొంది యంగిండియా.
ముఖ్యంగా సంజూ శాంసన్ కేవలం 63 బాల్స్లోనే 86 రన్స్ చేసి టీమిండియాను విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు. తొలి వన్డేలో ఓడినా టీమ్ పోరాటం ఆకట్టుకుంది. మూడు వన్డేల సిరీస్లో రెండో మ్యాచ్ ఆదివారం (అక్టోబర్ 9) జరగనుంది.