Twitter paid subscription in India : ఇండియాలో 'బ్లూ టిక్' పెయిడ్ సర్వీస్ షురూ.. ధర ఎంతంటే!
11 November 2022, 7:43 IST
- Twitter paid subscription in India : అమెరికాలో బ్లూ టిక్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ను ప్రారంభించిన ట్విట్టర్.. తాజాగా ఇండియాలో కూడా అమలు చేసింది. నెలకు రూ. 719తో బ్లూ టిక్ వెరిఫికేషన్ ట్యాగ్ను ఇస్తోంది ట్విట్టర్.
ఇండియాలో ట్విట్ర్ బ్లూ టిక్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ షురూ..!
Twitter paid subscription in India : ఇండియాలో బ్లూ టిక్ సర్వీసులను ప్రారంభించింది ట్విట్టర్. ఇండియాలో నెలకు రూ. 719తో బ్లూ టిక్ వెరిఫికేషన్ ట్యాగ్ను ఇస్తోంది ఈ సోషల్ మీడియా సంస్థ. అమెరికాలో బ్లూ టిక్ సర్వీసుల కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాల్సి వస్తోంది.
ట్విట్టర్ బ్లూకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని తమకు నోటిఫికేషన్ వచ్చినట్టు.. ఇండియాలోని కొంతమంది యూజర్లు తెలిపారు. అయితే.. ఈ అప్డేట్ ప్రస్తుతాని ఐఫోన్లో మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇది అందరికీ అందుబాటులోకి వస్తుందని సమాచారం.
Twitter blue tick cost in India : సబ్స్క్రైబ్ చేసుకునే యూజర్లకు.. ఎలాంటి వెరిఫికేషన్ లేకుండాన ట్విట్టర్ బ్లూ టిక్ వచ్చేస్తుంది. ట్విట్టర్కు సంబంధించిన అన్ని విషయాల్లో.. బ్లూ టిక్ సబ్స్క్రైబర్లకు 'ప్రయారిటీ' లభిస్తుందని తెలుస్తోంది.
అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ను తీసుకురావడంతో యూజర్ల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎలాన్ మస్క్ నిర్ణయం..
Elon Musk Twitter latest news : దాదాపు 6 నెలల తర్వాత ట్విట్టర్ను అధికారికంగా సొంతం చేసుకున్న అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. వస్తూనే సంస్థలో అనేక మార్పులు చేశారు. ఇందులో భాగంగానే బ్లూ టిక్కు పెయిడ్ సబ్స్క్రిప్షన్ను అమలు చేశారు. రానున్న రోజుల్లో ట్విట్టర్ మోనిటైజేషన్ను కూడా ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.
అంతేకాకుండా.. సంస్థలో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. ట్విట్టర్ ఇండియాలో 90శాతం మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
'ట్విట్టర్ దివాళా తీస్తుంది..'
Twitter Bankruptcy : సంస్థలో తాజా పరిణామాల నేపథ్యంలో పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు ట్విట్టర్కు గుడ్ బై చెబుతున్నారు. ట్విట్టర్ను వీరు నూతన శిఖరాలకు చేర్చుతారని ఎలాన్ మస్క్ గతంలో భావించారు. ఇక ఇప్పుడు.. వీరు ఉద్యోగాల నుంచి తప్పుకోవడంతో.. ట్విట్టర్పై కీలక వ్యాఖ్యాలు చేశారు ఎలాన్ మస్క్. భవిష్యత్తులో.. ట్విట్టర్ దివాళా తీసే అవకాశం ఉందని తెలిపారు.
అయితే.. ట్విట్టర్ దివాళా తీస్తుందన్న ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై ఆ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇలా సీనియర్ అధికారులు క్విట్ చేస్తుండటంపై యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులను గమనిస్తున్నట్టు పేర్కొంది. ఈ రాజీనామాలతో రెగ్యూలేటరీ ఆర్డర్లను ట్విట్టర్ ఉల్లంఘించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
"ట్విట్టర్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను మేము ట్రాక్ చేస్తూనే ఉన్నాము. ఏ సీఈఓ, కంపెనీ చట్టాలకు అతీతం కాదు. చట్టాల్లోని నిబంధనలకు అందరు కట్టుబడి ఉండాలి. చట్టాలను వాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాము," అని ఎఫ్టీసీ డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ డౌగ్లస్ ఫర్రార్ తెలిపారు.