Indian Prisoners: విదేశీ జైళ్లలో 8 వేల మంది భారతీయులు - కేంద్రం లెక్కలివే
09 December 2022, 22:23 IST
Ministry of External Affairs India: విదేశాల్లోని జైళ్లలో భారతీయ ఖైదీలు ఎంత మంది ఉన్నారనే దానిపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విదేశాల్లో 8441 మంది భారతీయులు ఖైదీలు ఉండగా.. ఇందులో సగం మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారని వెల్లడించింది.
భారతీయ ఖైదీలపై కేంద్రం కీలక ప్రకటన
Indians Imprisoned in Foreign Jails: విదేశాల్లోని జైళ్లలో భారతీయ ఖైదీలు ఎంత మంది ఉన్నారనే దానిపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. విదేశాల్లో దాదాపు 8,441 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇందులో 4,389 మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నట్లు చెప్పారు.
"ప్రభుత్వం వద్ద ఉన్న ప్రస్తుత లెక్కల ప్రకారం... విదేశీ జైళ్లలో అండర్ ట్రయల్స్తో సహా భారతీయ ఖైదీల సంఖ్య 8,441గా ఉంది. వీరిలో 4,389 మంది గల్ఫ్ దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ లో ఉన్నారు" అని కేంద్రమంత్రి వెల్లడించారు. మరోవైపు పలువురి ఖైదీల విడుదల విషయంలో సంప్రదింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
పాస్ పోర్టు సేవలపై ప్రకటన..
మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో పాస్ పోర్టు సేవలు 500 శాతం పెరిగాయని కేంద్ర విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం లోక్సభలో క్వశ్చన్ అవర్లో ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 32 మిలియన్ల మంది భారతీయులు లేదా భారతీయ సంతతి ప్రజలు విదేశాల్లో నివసిస్తున్నారని చెప్పారు. కేంద్ర మంత్రిత్వ శాఖ పాస్ పోర్టులను జారీ చేయడంలో వేగంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. పాస్పోర్ట్ ల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి స్పెషల్ డ్రైవ్స్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిమాండ్ కు అనుగుణంగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.