Amit Shah in Kashmir: ‘పాక్ తో చర్చలా? క్వశ్చనే లేదు..’
05 October 2022, 17:37 IST
Amit Shah in Kashmir: కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. పాకిస్తాన్ తో కాదు.. జమ్మూకశ్మీర్ ప్రజలతో చర్చిస్తామన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Amit Shah in Kashmir: కశ్మీర్ కు సంబంధించి పాకిస్తాన్ తో చర్చించే ఆలోచనే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కశ్మీర్ లోని బారాముల్లాలో బుధవారం జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
Amit Shah in Kashmir: మీతో మాట్లాడుతాం..
కశ్మీర్ అభివృద్ధికి సంబంధించి కశ్మీర్ ప్రజలతో, కశ్మీర్ యువతతో చర్చిస్తాం. కానీ పాకిస్తాన్ తో కాదు అని అమిత్ షా తెలిపారు. ఉగ్రవాదానికి దూరంగా ఉండాలని స్థానిక యువతకు హితవు పలికారు. ఉగ్రవాదంతో ఏమీ సాధించలేమని, టెర్రరిజం వల్ల ఇప్పటివరకు 42 వేల ప్రాణాలు పోయాయని వివరించారు. పాకిస్తాన్ తో చర్చలు జరపాలనే వారిపై ఈ సందర్భంగా అమిత్ షా మండిపడ్డారు.
Amit Shah in Kashmir: ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తాం
ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి మోదీ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ఈ విషయంలో ప్రధాని మోదీ చాలా కఠినంగా వ్యవహరిస్తారని షా స్పష్టం చేశారు. ఇప్పటికే ఉగ్రవాద మూలాలను తుదముట్టించామన్నారు. పూర్తి శాంతియుత ప్రాంతంగా జమ్మూకశ్మీర్ ను మార్చాలన్నది తమ అభిమతమన్నారు.
Amit Shah in Kashmir: ఎన్నికలు త్వరలో..
అసెంబ్లీ ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామని అమిత్ షా తెలిపారు. ఎన్నికల సంఘం సవరించిన ఓటర్ల జాబితాను ప్రకటించిన వెంటనే ఎన్నికల నిర్వహణ జరుగుతుందన్నారు. ఈ ఎన్నికలను పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామన్నారు.
Amit Shah in Kashmir: విపక్షాలపై మండిపాటు
ఈ సందర్భంగా కాంగ్రెస్ పై, ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలపై అమిత్ షా విరుచుకుపడ్డారు. ముఫ్తీ అండ్ కంపెనీ, అబ్దుల్లా అండ్ సన్స్, కాంగ్రెస్ ల పాలనలో జమ్మూకశ్మీర్ భారీగా నష్టపోయిందన్నారు. వారి పాలన కారణంగా ఈ ప్రాంతం టెర్రరిస్ట్ లకు స్వర్గధామంగా మారిందన్నారు.