రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం.. సీఎంల గైర్హాజరు
25 July 2022, 10:17 IST
- రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు.
రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు పార్లమెంటుకు బయలుదేరిన ద్రౌపది ముర్ము ఆమె వెంట రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన రాంనాథ్ కోవింద్ వెళుతున్న దృశ్యం
న్యూఢిల్లీ, జూలై 25: రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ముఖ్యమంత్రులు హాజరుకావడం లేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్p కుమార్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తదితరులు హాజరు కావడం లేదు. ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్, తమిళి సై సౌందర రాజన్ హాజరుకానున్నారు. ముర్ము అభ్యర్థిత్వానికి తెలంగాణ అధికార పార్టీ మద్దతు ఇవ్వలేదు. అయితే ఆంధ్రప్రదేశ్లోని అధికార, ప్రతిపక్షాలు మద్దతు పలికాయి.
నితీష్ కుమార్ ఇలాంటి ముఖ్యమైన సంఘటనను దాటవేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా బీజేపీతో విభేదాలు ఉన్నాయని చెబుతూ బీజేపీ నిర్వహించిన పలు కార్యక్రమాలను ఆయన మిస్సయ్యారు.
పార్టీ అగ్రనేతల నుంచి ఆహ్వానం వచ్చిన పలు కార్యక్రమాలను ముఖ్యమంత్రి దాటవేశారు.
జూలై 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలిచిన ముఖ్యమంత్రుల సమావేశానికి కూడా ఆయన దూరమయ్యారు.
శుక్రవారం పదవీవిరమణ చేస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యమిచ్చిన విందుకు ఆయన మళ్లీ దూరంగా ఉన్నారు.
రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉదయం 10:15 గంటలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయిస్తారు. దీని తర్వాత గన్ సెల్యూట్ ఉంటుంది.
పదవీకాలం ముగిసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంటుకు రాకతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. భారత రాష్ట్రపతి పదవిపై ప్రమాణం చేసిన కొద్దిసేపటికే ముర్ము తన మొదటి ప్రసంగం చేస్తారు.
రాష్ట్రపతిగా ఎన్నికైన ముర్ము దేశ రాజధానిలోని రాజ్ఘాట్లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం పదవీవిరమణ చేస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితా కోవింద్లను రాష్ట్రపతి భవన్లో ఆమె కలిశారు.
ముర్మును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సెంట్రల్ హాల్కు తీసుకువెళతారు. ద్రౌపది ముర్ము అక్కడికి చేరుకున్న తర్వాత సెంట్రల్ హాల్లో జాతీయ గీతం ఆలాపన ఉంటుంది. ఆ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలో ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జూలై 22న జార్ఖండ్ మాజీ గవర్నర్ ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. దేశంలో అత్యున్నత పదవిని ఆక్రమించిన మొదటి మహిళా గిరిజన అభ్యర్థి, దేశంలో రెండవ మహిళగా చరిత్ర సృష్టించారు.
గురువారం ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును దేశ 15వ రాష్ట్రపతిగా అధికారికంగా ప్రకటించారు.