Movement against CPS: కేరళలో మొదలైన సీపీయస్ రద్దు మహోద్యమం
21 January 2023, 21:11 IST
Movement against CPS: నేషనల్ మూవ్ మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (NMOPS) ఆధ్వర్యంలో కేరళలో సీపీఎస్ రద్దును కోరుతూ భారీ నిరసన ప్రదర్శన జరిగింది.
సీపీఎస్ రద్దును కోరుతూ కేరళలో జరిగిన ధర్నాలో ప్రసంగిస్తున్న స్థిత ప్రజ్ఞ
Movement against CPS: నేషనల్ మూవ్ మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (NMOPS) ఆధ్వర్యంలో స్టేట్ ఎన్. పి.యస్.ఎంప్లాయిస్ కలెక్టివ్ కేరళ ద్వారా కేరళలో సీపీయస్ రద్దు కొరకు ఎన్. ఎం.ఓ.పి.యస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ నేతృత్వంలో,షాహిద్ రఫిక్ అధ్యక్షతన కేరళ రాష్ట్ర కేంద్రం త్రివేండ్రం సెక్రటేరియట్ ముందు ధర్నా జరిగింది. ఈ ధర్నాకు కర్ణాటక నుండి రంగనాథ్, తెలంగాణ నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్, తమిళనాడు నుండి ఆరోగ్య దాస్ లు హాజరయ్యారు .ఈ సందర్భంగా ధర్నా నుద్దేశించి ఎన్. ఎం.ఓ.పి.యస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ మాట్లాడారు. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో సీపీయస్ రద్దు చేయటంలో ఎన్. ఎం.ఓ.పి.యస్ ప్రముఖ పాత్ర వహించిందన్నారు.
Movement against CPS: 1952లో ఐ ఎల్ ఓ కన్వెన్షన్
1952లో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) 102వ కన్వెన్షన్ లో పెన్షన్ అనేది ఉద్యోగి నెలవారి జీతంలో కనీసం 50 శాతం ఉండాలని తీర్మానించిందన్నారు. కేరళ రాష్ట్రంలో ఇప్పటికే రెండు లక్షలకు పైగా సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల పదివేల కోట్లకు పైగా సొమ్ము షేర్ మార్కెట్లో పెట్టుబడులుగా వెళ్లిందన్నారు. కార్పొరేట్లకు కొమ్ముగాసే ఈ పెన్షన్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల పాత పెన్షన్ ను పునరుద్ధరించే రాష్ట్రాల పట్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యలను స్థిత ప్రజ్ఞ తీవ్రంగా ఖండించారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల 309 ఆర్టికల్ ద్వారా రాష్ట్రానికి సంపూర్ణ అధికారాలు ఉంటాయని రాజ్యాంగం తెలిపిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటివరకు దేశ సంపదలో 40 శాతం సంపద కేవలం ఒక శాతం ఉన్న కార్పొరేట్ వారికే దాసోహం అన్నట్లు ఆర్బిఐ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
Movement against CPS: షేర్ మార్కెట్ జూదం
మధ్యతరగతి ఉద్యోగి మరణించినా, ఉద్యోగ విరమణ చేసినా వారి కుటుంబాలను ఈ షేర్ మార్కెట్ జూదంలోనికి లాగడమే లక్ష్యంగా ఆర్బిఐ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఉద్యోగులకు పాత పెన్షన్ రద్దుచేసి కొత్త పెన్షన్ అమలు చేసేటప్పుడు ఏ బ్యాంకు ఏ ప్రణాళిక సంస్థ స్పందించలేదన్నారు. ఉద్యోగి 18 సంవత్సరాల సీపీఎస్ అమలు తరువాత ఇప్పటివరకు రిటైర్ అయిన, మరణించిన ఉద్యోగులకు అందిన ప్రయోజనాలు శూన్యం అని, సామాజిక భద్రత కరువైందని అన్నారు. నేడు పాత పెన్షన్ కోరుకుంటే అమలు చేయాల్సింది పోయి రాష్ట్రాలను హెచ్చరిస్తున్నట్లుగా ఆర్బీఐ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కమ్యూనిస్టు పార్టీలు కార్పొరేట్ల కు పెట్టుబడులు వెళ్లకుండా ఉద్యోగి సంక్షేమం పట్ల బాధ్యతతో పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. అనంతరం ఓట్ ఫర్ పెన్షన్ ప్రతిజ్ఞను, పాత పెన్షన్ ఇచ్చే పార్టీలకే మన ఓటు అనే ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో కేరళ సెక్రటేరియట్ ఎంప్లాయిస్ మరియు ఉద్యోగ ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
టాపిక్