Karnataka politics: ఢిల్లీకి మారిన ‘‘కర్నాటకం’’.. రంగంలోకి రాహుల్ గాంధీ
16 May 2023, 15:05 IST
Karnataka politics: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి.. ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయం పెద్ద తల నొప్పిగా మారింది.
ఢిల్లీ చేరుకున్న కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్
Karnataka politics: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (karnataka assembly elections 2023) ఘన విజయం అనంతరం.. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ లో దిగ్గజాల వంటి ఇద్దరు నాయకులు సిద్ధ రామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్ (DK Shivakumar) ముఖ్యమంత్రి పీఠం కోసం తీవ్రంగా పోటీ పడుతుంటే, వారిలో ఎవరిని ఎంపిక చేయాలో తెలియని సందిగ్ధంలో పార్టీ అగ్ర నాయకత్వం పడింది. రాష్ట్రంలో పార్టీ విజయానికి ఆ ఇద్దరు నాయకులు విశేష కృషి చేశారు. తమ ఆర్థిక వనరులను, శక్తి యుక్తులను, వ్యూహలను, అనుభవాన్ని ఉపయోగించి తిరిగి పార్టీకి ఘన విజయం అందించారు.
Karnataka politics: ఇద్దరిలో ఎవరికి?
ప్రచార సమయంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్రంలో సీనియర్ నాయకులైన సిద్ధ రామయ్య(Siddaramaiah) , డీకే శివకుమార్ (DK Shivakumar)పార్టీ విజయానికి కృషి చేశారు. సీఎం అభ్యర్థిత్వం విషయంలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా, సంయమనం పాటించారు. ఇవే తనకు చివరి ఎన్నికలని, ఇకపై ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటానని సిద్ధ రామయ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుడు, పరిపాలనలో విశేష అనుభవం ఉన్న సిద్ధ రామయ్య (Siddaramaiah) కు మరోసారి అవకాశం ఇవ్వాలా?.. లేక పార్టీ కోసం అనేక త్యాగాలు చేసి, అనేక కేసులను ఎదుర్కొని, జైలుకు కూడా వెళ్లి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం శాయశక్తులా కృషి చేసిన డీకే శివకుమార్ (DK Shivakumar) ను సీఎం చేయాలా? అన్న మీమాంసలో కాంగ్రెస్ హై కమాండ్ ఉంది. ఆ ఇద్దరు నాయకులు కూడా సీఎం పీఠం విషయంలో ఎలాంటి పట్టువిడుపులకు సిద్ధంగా లేరు.
Karnataka politics: ఢిల్లీకి రాజకీయం
ఈ పరిస్థితుల్లో కర్నాటక రాజకీయం ఢిల్లీ వేదికకు మారింది. డీకే శివకుమార్ (DK Shivakumar) మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. సిద్ధ రామయ్య (Siddaramaiah) ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. పార్టీ కీలక నాయకుడు, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) మంగళవారం ఉదయం నేరుగా ఢిల్లీలోని ప్రస్తుత పార్టీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) నివాసానికి వెళ్లారు. ఇరువురు నేతలు ఏకాంతంగా కర్నాటక రాజకీయాలపై చర్చించారు. డీకే, సిద్ధూ (Siddaramaiah) ల్లో ఎవరిని సీఎం చేయాలి? సీఎంగా అవకాశం కల్పించని నేతను ఎలా బుజ్జగించాలనే విషయంతో పాటు మంత్రివర్గ శాఖలపై కూడా వారు చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో కాంగ్రెస్ (congress) కర్నాటక (Karnataka) వ్యవహారాల ఇన్ చార్జి రణదీప్ సూర్జేవాలా కూడా పాల్గొన్నారు. అలాగే, ఖర్గే (Mallikarjun Kharge ఇప్పటికే కర్నాటకలోని పలువురు పార్టీ నాయకులతో, కర్నాటకలో పార్టీ పరిశీలకులతో చర్చించారు. వారి అభిప్రాయాలను సేకరించారు. ఈ నేపథ్యంలో, మరోసారి ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న సిద్ధ రామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్ (DK Shivakumar) లతో చర్చించి, మంగళవారం రాత్రి లోగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.