IMD alert : ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ప్రజలకు ఐఎండీ అలర్ట్
30 October 2022, 17:12 IST
- Heavy rain alert : ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో తమిళనాడు, కేరళకు భారీ వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. నవంబర్ 3 వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ప్రజలకు ఐఎండీ అలర్ట్
Heavy rain alert : తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ప్రాంతాలకు వర్ష సూచనను ఇచ్చింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). ఆదివారం నుంచి నవంబర్ 3 వరకు ఆయా ప్రాంతాలతో పాటు కరైకల్, మాహేలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ప్రజలను అలర్ట్ చేసింది.
ఆదివారం నాటికి రాయలసీమ, దక్షిణ కర్ణాటక, కేరళ-మాహే, కరైకల్, పుదుచ్చేరి, తమిళనాడులోకి ఈశాన్య రుతుపవనాలు చేరుకున్నాయని ఐఎండీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, యానాంకు ఆదివారం నుంచి నవంబర్ 2 వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. రాయలసీమలో నవంబర్ 1,2 మధ్య భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
Heavy rains in AP : దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో నవంబర్ 3న భారీ వర్షాలు పడతాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో సోమ, మంగళవారాల్లో ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు పడతాయి.
జమ్ముకశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బాల్టిస్థాన్, ముజాఫర్బాద్లో సోమవారం నుంచి బుధవారం వరకు మోస్తారు వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 1న వర్షాలు పడతాయి.
Heavy rains in Tamil Nadu : భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డు మీదకు వరద నీరు చేరుకునే అవకాశం ఉంది. పలు ప్రాంతాలు జలమయం అవ్వొచ్చు. ముఖ్యమైన నగరాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడవచ్చు. పంటకు నష్టం జరగవచ్చు. ఈ విషయాలు చెబుతూ.. ఆయా రాష్ట్రాల అధికారులను అప్రమత్తం చేసింది ఐఎండీ.