కేసీఆర్పై విరుచుకుపడ్డ హిమంత బిశ్వ
14 February 2022, 13:50 IST
గౌహతి: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్పై కేంద్ర ప్రభుత్వాన్ని ఆధారాలు అడిగినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం మండిపడ్డారు.

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (ఫైల్ ఫోటో)
2019 సెప్టెంబర్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్పై కేంద్ర ప్రభుత్వాన్ని ఆధారాలు అడిగినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం మండిపడ్డారు.
కేసీఆర్ విలేకరుల సమావేశానికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పంచుకుంటూ.. ‘కేసీఆర్ రుజువు కోరుతున్నారు. పుల్వామా దాడి జరిగి ఏడాది అవుతున్న సందర్భంలో.. సర్జికల్ స్ట్రైక్ను ప్రశ్నించడం ద్వారా ప్రతిపక్షాలు మళ్లీ మన అమరవీరులను అవమానించాయి’ అని అన్నారు.
‘గాంధీ కుటుంబానికి తమ విధేయతను నిరూపించుకునే ప్రయత్నంలో వారు సైన్యానికి ద్రోహం చేశారు. నా విధేయత సైన్యంతో ఉంది. మీ జీవితమంతా నన్ను దూషించండి. నేను పట్టించుకోను’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
కేసీఆర్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఈ రోజు కూడా నేను రుజువు అడుగుతున్నాను. భారత ప్రభుత్వాన్ని ఆధారాలుచూపనివ్వండి. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. అందుకే ప్రజలు దానిని అడుగుతున్నారు’ అని అన్నారు.
గత వారం రోజులుగా సర్జికల్ స్ట్రైక్స్ అంశంపై ఇద్దరు సీఎంలు వాగ్వాదానికి దిగారు. శుక్రవారం అసోం ముఖ్యమంత్రి ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ.. 'ఇంతమంది మనస్తత్వం చూడండి.. జనరల్ బిపిన్ రావత్ దేశానికే గర్వకారణం.. ఆయన నేతృత్వంలోనే భారత్ పాకిస్థాన్లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని.. రుజువు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మీరు రాజీవ్ గాంధీ కుమారుడా కాదా అని మేం మిమ్మల్ని ఎప్పుడైనా రుజువు అడిగామా? నా సైన్యం నుండి రుజువు కోరడానికి మీకు ఏమి హక్కు ఉంది?’ అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు గాను అసోం సీఎంను బర్తరఫ్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీ చీఫ్ జగత్ ప్రకాశ్ నడ్డాను డిమాండ్ చేశారు.
కేసీఆర్పై ఎదురుదాడికి దిగిన శర్మ ‘ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేశారా లేదా అని ప్రశ్నించడం అతిపెద్ద నేరమని నేను నమ్ముతున్నాను. కాంగ్రెస్ నాయకుడు రాహుల్పై నేను చేసిన వ్యాఖ్యలను చూసి కేసీఆర్ రెచ్చిపోయారు. మన సైన్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మాత్రం విస్మరించారు..’ అని విరుచుకుపడ్డారు.
సెప్టెంబరు 2016లో ఉడీలోని బేస్ క్యాంపులో 19 మంది భారత సైనికులు మరణించిన తర్వాత భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది.
కాగా, ఫిబ్రవరి 14, 2019న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు మరణించిన పుల్వామా దాడి దుర్ఘటనను ఈరోజు దేశం స్మరించుకుంది.