India retaliates Bilawal's comment: ‘‘మోదీపై వ్యాఖ్యలు దిగజారుడుతనం.. అనాగరికం’’
16 December 2022, 22:44 IST
India retaliates Bilawal's comment: భారత ప్రధాని నరేంద్రమోదీని కించపరుస్తూ, అవమానిస్తూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది.
ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)
India retaliates Bilawal's comment: న్యూయార్క్ లోని ఐక్య రాజ్య సమితి భద్రత మండలి(UNSC) వేదికగా పాకిస్తాన్ భారత్ పై మరోసారి విషం కక్కింది. భారత ప్రధాని నరేంద్ర మోదీని అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. పాక్ విదేశాంగ మంత్రి, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో భారత ప్రధాని నరేంద్ర మోదీని అవమానిస్తూ UNSC వేదికగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. 1971లో జరిగిన యుద్ధంలో ఇదే రోజు ఏం జరిగిందో భుట్లో మర్చిపోయారేమో అని ఘాటుగా జవాబిచ్చింది.
India retaliates Bilawal's comment: దిగజారుడుతనం
భుట్టో వ్యాఖ్యలు దిగజారుడు తనానికి పరాకాష్ట అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో మండిపడింది. పాక్ విదేశాంగ మంత్రి స్వదేశం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, నిస్పృహతో ఇలా అనాగరికంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసింది. ‘పాక్ విదేశాంగ మంత్రి 1971లో ఈ రోజు ఏం జరిగిందో మర్చిపోయినట్లు ఉన్నారు. బెంగాలీలు, హిందువులపై జరిపిన మారణ హోమానికి ఫలితంగా ఆ రోజు బాంగ్లా యుద్ధంలో దారుణ పరాభవాన్ని చవి చూసిన విషయం మర్చిపోయినట్లున్నారు’ అని మండిపడింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం అందించడం, ఇతర దేశాలపై ఉగ్ర దాడులకు పాల్పడేలా పురికొల్పడం వంటి చర్యలు నిలిపివేసి.. ఇతర దేశాల మాదరిగా దేశ పురోభివృద్ధి కోసం కృషి చేయడం ప్రారంభించమని హితవు పలికింది.