Air India | టాటా టు టాటా.. ఇదీ ఎయిరిండియా మహారాజా చరిత్ర
27 January 2022, 18:12 IST
- టాటా గ్రూప్ వ్యవస్థాపకులైన జేఆర్డీ టాటా దేశంలో తొలి ఎయిర్లైన్స్ను 1932లోనే ప్రారంభించారు. అప్పట్లో ఇప్పటి పాకిస్థాన్లోని కరాచీ నుంచి బాంబే వరకూ విమానం నడిపేవారు. - ఈ అప్పుల సంస్థను వదిలించుకోవడానికి రెండు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది.
ఎయిరిండియా మళ్లీ టాటాల చేతుల్లోకి..
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా అప్పుల ఊబిలో చిక్కుకొని బెయిల్ ఔట్ల మీద బెయిల్ ఔట్లు పొందిన ఎయిరిండియా మొత్తానికి మళ్లీ తన ఒకప్పటి యజమాని టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఎయిరిండియా ప్రస్థానం ఓసారి చూద్దాం.
1932లోనే ప్రారంభం
- 1932లో టాటా ఎయిర్లైన్స్ పేరుతో ఇది ప్రారంభమైంది. 1946లో టాటా సన్స్ ఆధ్వర్యంలో ఉన్న ఏవియేషన్ సంస్థకు ఎయిర్ ఇండియా అనే పేరు పెట్టారు. 1948లో యూరప్కు ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ పేరుతో తొలిసారి విమానాలు నడిపారు.
- ఈ ఇంటర్నేషనల్ సర్వీస్ దేశంలో తొలి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రారంభమైన వాటిలో ఒకటి. ఇందులో ప్రభుత్వం వాటా 49, టాటాల వాటా 25 కాగా.. మిగిలినది ప్రజల వాటా.
- 1953లో ఎయిరిండియాను జాతీయం చేశారు. తర్వాత నాలుగు దశాబ్దాల పాటు ఏవియేషన్ రంగాన్ని ఎయిరిండియా ఏలింది.
- అయితే 1994-95లో ఏవియేషన్లో ప్రైవేట్ రంగం ఎంట్రీతో ఎయిరిండియా కష్టాలు ప్రారంభమయ్యాయి.
- 2000-01 సమయంలో అప్పటి వాజ్పేయీ ప్రభుత్వం మెజార్టీ వాటా లేదంటే 40 శాతం విక్రయించాలని భావించింది. దీనికి టాటాతోపాటు సింగపూర్ ఎయిర్లైన్స్ ఆసక్తి చూపాయి. అయితే ట్రేడ్ యూనియన్లు ఈ ప్రైవేటైజేషన్ను వ్యతిరేకించడంతో సింగపూర్ ఎయిర్లైన్స్ వెనుకడుగు వేసింది.
- 2004-14 మధ్య పదేళ్ల పాటు యూపీఏ ప్రభుత్వం ఈ ప్రైవేటైజేషన్ను పక్కనపెట్టింది.
- 2007-08లో ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిరిండియా విలీనం తర్వాత.. ప్రతి ఏటా ఎయిరిండియా నష్టాలు చవిచూసింది.
- 2017 నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎయిరిండియాతోపాటు ఐదు అనుబంధ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించింది.
- 2018 మేలో తొలిసారి బిడ్స్ ఆహ్వానించినా ఎవరూ ముందుకు రాలేదు.
- దీంతో 2018, జూన్లో ఎయిరిండియా విషయంలో ఆచితూచి ముందడుగు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- జనవరి, 2020లో మరోసారి ఎయిరిండియా ప్రైవేటైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
- 2020, అక్టోబర్లో ఎయిరిండియాలో ఎంత అప్పు తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఇన్వెస్టర్లకే వదిలేసింది.
- డిసెంబర్, 2020లో ఎయిరిండియాకు పలు బిడ్లు దాఖలయ్యాయని దీపమ్ సెక్రటరీ వెల్లడించారు.
- ఏప్రిల్ 2021లో ఎయిరిండియా కోసం ప్రభుత్వం ఫైనాన్షియల్ బిడ్లు ఆహ్వానించింది. సెప్టెంబర్ 15 చివరి తేదీగా నిర్ణయించింది.
- సెప్టెంబర్ 2021లో టాటా గ్రూప్తోపాటు స్పైస్జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ ఆర్థిక బిడ్లు దాఖలు చేశారు.
- అక్టోబర్ 8, 2021న రూ.18 వేల కోట్లతో టాటా గ్రూప్ బిడ్ గెలుచుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
- అక్టోబర్ 25, 2021న టాటా గ్రూప్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
- జనవరి 27, 2022న ఎయిరిండియా యాజమాన్యాన్ని టాటా గ్రూప్ చేజిక్కించుకుంది.