Jalpaiguri flash floods : ఆకస్మిక వరదలతో పశ్చిమ్ బెంగాల్లో ఏడుగురు మృతి!
06 October 2022, 6:37 IST
Jalpaiguri flash floods death toll : పశ్చిమ్ బెంగాల్లో దసరా వేళ తీవ్ర విషాదం నెలకొంది. మాల్ నదిని ఆకస్మిక వరదలు ముంచ్చెత్తాయి. విగ్రహాల నిమజ్జనానికి వెళ్లిన అనేకమంది వరదల్లో కొట్టుకుపోయారు. ఇప్పటివరకు ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు.
ఆకస్మిక వరదలతో పశ్చిమ్ బెంగాల్లో ఏడుగురు మృతి!
West Bengal flash floods : భారీ వర్షాలు కురుస్తున్న పశ్చిమ్ బెంగాల్లోని జల్పైగురి ప్రాంతాన్ని ఆకస్మిక వరదలు ముంచ్చెత్తాయి. దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కోసం మాల్ నదీ ప్రాంతానికి భక్తులు వెళ్లగా.. ఒక్కసారిగా వరదల్లో చిక్కుకుపోయారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గల్లంతయ్యారు.
"దేవీ విగ్రహ నిమజ్జనం సమయంలో మాల్ నదిని ఒక్కసారిగా ఆకస్మిక వరదలు ముంచ్చెత్తాయి. అనేక మంది నదిలో చిక్కుకుపోయారు. మరికొందరు కొట్టుకుపోయారు. ఇప్పటివరకు 7 మృతదేహాలను వెలికి తీశాము. ఎన్డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్ సిబ్బంది సహాయక చర్యల్లో ఉన్నారు," అని జల్పైగురి ఎస్పీ దేబార్షి దత్త మీడియాకు చెప్పారు.
ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"పశ్చిమ్ బెంగాల్ జల్పైగురిలో దుర్గా పూజ వేళ జరిగిన విషాదంతో బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి," అని ట్వీట్ చేశారు మోదీ.