IND vs SL Series: ఆ స్పోర్ట్స్ ఛానల్కు ఉత్సాహం ఆగలేదు.. జట్టు ప్రకటనకు ముందే కెప్టెన్గా హార్దిక్ అని లీక్
26 December 2022, 7:34 IST
- IND vs SL Series: ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ స్టార్ స్పోర్ట్కు ఉత్సాహం ఆగలేదు. టీమిండియా తన తదుపరి సిరీస్ను శ్రీలంకతో ఆడబోతుండగా.. ఇంకా జట్టును ప్రకటించకముందే.. హార్దిక్ను కెప్టెన్ అని సోషల్ మీడియాలో లీక్ చేసేసింది. అనంతరం వీడియో వైరల్ కావడంతో డిలీట్ చేసింది.
హార్దిక్ పాండ్య
IND vs SL Series: బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్ను భారత్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడంతో మెన్ ఇన్ బ్లూ తర్వాత ఆడబోయే సిరీస్ గురించి అప్పుడే చర్చ మొదలైంది. 2023 సెషన్ను శ్రీలంకతో ప్రారంభించినుంది టీమిండియా. స్వదేశంలో లంక జట్టుతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జనవరి 3 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా.. ఇంత వరకు సెలక్టర్లు భారత జట్టును ప్రకటించలేదు. అయితే సెలక్టర్లు స్క్వాడ్ను ప్రకటించకముందే స్టార్ స్పోర్ట్స్ ఛానల్కు ఉత్సాహం ఆగలేదు. శ్రీలంకతో టీ20 సిరీస్కు హార్దిక్ పాండ్యానే కెప్టెన్గా వ్యవహిరిస్తున్నారనే విషయాన్ని బయటకు లీక్ చేసింది. అంతేకాకుండా అతడితో ఓ యాడ్ను కూడా నిర్వహించి ఆ యాడ్ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
ఆదివారం బంగ్లాదేశ్తో రెండో టెస్టులో విజయానంతరం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తన అధికారిక ట్విటర్ ద్వారా ఓ పోస్టు పెట్టింది. ఇందులో హార్దిక్ పాండ్య త్వరలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించనున్న విషయాన్ని లీక్ చేసింది. అంతటితో ఆగకుండా వీడియో చివర్లో హార్దిక్ ఓ పక్కన, లంక సారథి దసున్ శనకా మరోపక్క ఉన్నట్లు ముందుగానే హింట్ ఇచ్చింది. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే త్వరలో తమ పదవీ కాలం ముగియనున్న ఛేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంత వరకు జట్టును ప్రకటించలేదు. అయితే ఇంత వరకు రెండు జట్లపై వారు సమావేశం కానప్పటికీ.. అంతకంటే ముందుగానే స్టార్ స్పోర్ట్స్ భారత కెప్టెన్ను లీక్ చేయడం గమనార్హం.
సెలక్షన్ కమిటీ పని భారం, రెండు ఫార్మాట్లో ఆడుతున్న ఆటగాళ్లు, గాయం ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని స్టార్ స్పోర్ట్స్ హార్దిక్ను కెప్టెన్గా నియమిస్తారని లీక్ చేసి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం స్టార్స్ స్పోర్ట్స్ షేర్ చేసిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో స్టార్ స్పోర్ట్స్ ఛానల్ సదరు వీడియోను డిలీట్ చేసింది. డిలీట్ చేసినప్పటికీ నెటిజన్లు షేర్లు చేయడంతో ఆ వీడియో ఇంకా నెట్టింట కనిపిస్తూనే ఉంది.
ఈ వీడియోను బట్టి చూస్తుంటే హార్దిక్ పాండ్య టీ20 సిరీస్కు కూడా అందుబాటులో రాలేడని తెలుస్తోంది. అదే జరిగితే బొటన వేలు గాయం కారణంగా వరుసగా రెండో సిరీస్కు అతడు దూరం కానున్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో అతడి బొటన వేలికి గాయమైంది. దీంతో మూడో వన్డేతో పాటు రెండు టెస్టుల సిరీస్కు కూడా దూరమయ్యాడు. మరోపక్క శ్రీలంకతో టీ20 సిరీస్కు సీనియర్ ఆటగాళ్లయిన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించే అవకాశం కనిపిస్తోంది. వారి స్థానంలో స్పెషలిస్టు ప్లేయర్లను తీసుకోనున్నారు.
శ్రీలంకతో భారత్ ముందు టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత వన్డే సిరీస్లో పోటీ పడనుంది. టీ20 సిరీస్ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ జనవరి 12 నుంచి ఆడనుంది. ఇప్పటికే ఆసియా కప్ ఛాంపియన్గా అవతరించిన శ్రీలంకను.. తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్లోనూ మెరుగైన ప్రదర్శన చేసింది. మరి స్వదేశంలో జరగనున్న ఈ సిరీస్లో భారత్.. లంకేయులతో ఏ విధంగా ఆడనుందో చూడాలి.