Prabhas Fans on Salaar: సలార్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. చిత్రబృందం మాత్రం సైలెంట్..!
22 May 2023, 14:26 IST
- Prabhas Fans on Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ అప్డేట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, విజయ్ కిరగందూర్ కొన్ని రోజుల పాటు ట్విటర్కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ ఒత్తిడి తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సలార్
Prabhas Fans on Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఆయన నటించిన ఆదిపురుష్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న తెలిసిందే. ఈ మూవీ జూన్ 16న విడుదల కానుంది. మరి కొన్ని రోజుల్లో చిత్రయూనిట్ ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొననుంది. ఇదిలా ఉంటే సలార్ షూటింగ్ కూడా ప్రభాస్ దాదాపు కంప్లీట్ చేశారు. ఈ చిత్రం సెప్టెంబరు 28న విడుదల కాబోతుంది. అయితే ఈ మూవీకి సంబంధించి పోస్టర్లు తప్పితే ఎలాంటి అప్డేట్ చిత్రబృందం ఇవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
సలార్ మూవీ నుంచి అప్డేట్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు మరీ ఎక్కువగా ఉండటంతో కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉండాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ కిరగందూర్ అనుకుంటున్నారట. వీరిద్దరూ ట్విటర్ నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలని భావించి తమ అకౌంట్ను డీ యాక్టివేట్ చేశారని ఫిల్మ్ వర్గాల సమాచారం. ఫలితంగా ఫ్యాన్స్ వీరిని ట్రోల్ చేస్తున్నారు. ఎలాంటి మేజర్ అప్డేట్లు ఇవ్వలేదని వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
ఇటీవలే సలార్ విడుదల తేదీ కూడా వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే మేకర్స్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తొలుత సెప్టెంబరు 28న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ విడుదల వాయిదా పడుతుందని ఊహాగానాలు రాగా.. వాటిపై స్పష్టత ఇచ్చి.. అనుకున్న సమయానికే సినిమా రిలీజ్ అవుతుందని తెలిపారు.
సలార్ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అంతేకాకుండా సలార్ తర్వాత ప్రశాంత్ నీల్తో ప్రభాస్ మరో సినిమా చేయనున్నారని, ఈ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని కూడా వార్తలు రావడంతో ఈ కాంబోపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం దిల్ రాజు తీయనున్న మూవీ చర్చల దశలో ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వచ్చే అవకాశముంది.
హోంబలే ఫిల్మ్స్ తెలుగులో నిర్మిస్తున్న మొదటి చిత్రం సలార్. ప్రభాస్ ఈ చిత్రం ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది.