Kangana Ranaut: మహారాష్ట్ర కొత్త సీఎం ఏక్నాథ్ షిండేపై కంగనా ప్రశంసల వర్షం.. పోస్ట్ వైరల్
01 July 2022, 10:35 IST
- Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మహారాష్ట్ర కొత్త సీఎం ఏక్నాథ్ షిండేను పొగుడుతూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తన ఇన్స్టా స్టోరీలో కంగనా ఈ పోస్ట్ చేసింది.
కంగనా రనౌత్
ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఉన్నన్నాళ్లూ శాపనార్థాలు పెట్టిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. ఇప్పుడదే శివసేన పార్టీకి చెందిన ఏక్నాథ్ షిండే సీఎం కాగానే ప్రశంసిస్తోంది. గత ప్రభుత్వం తనను టార్గెట్ చేయడంతో చాలాసార్లు ఉద్ధవ్కు వ్యతిరేకంగా కామెంట్స్ చేసింది. ఈ మధ్యే ఏక్నాథ్ వర్గం శివసేన చీల్చిన తర్వాత కూడా కంగనా ఓ వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
హనుమాన్ చాలీసా చదవకుండా అడ్డుకున్నందుకే ఉద్ధవ్ థాక్రేకు ఈ గతి పట్టిందని అందులో చాలా ఘాటుగా విమర్శించింది. ఇక ఇప్పుడు ఏక్నాథ్ సీఎం అయిన తర్వాత ఇన్స్టా ద్వారా స్పందిస్తూ.. "ఎంతో స్ఫూర్తిదాయకమైన సక్సెస్ స్టోరీ.. జీవనం కోసం ఆటో రిక్షా నడిపిన వ్యక్తి దేశంలో ముఖ్యమైన, శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఎదిగారు.. కంగ్రాచులేషన్స్ సర్" అని ప్రశంసించింది.
ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కంగనా రనౌత్ ఆయనపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఎన్నోసార్లు ఉద్ధవ్ ప్రభుత్వం లక్ష్యంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. గతంలో ముంబైలోని ఆమె ఇంటిని కూడా కూల్చడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె తన తాజా వీడియోలో ప్రస్తావించింది.
"ఉద్ధవ్ థాక్రే.. ఏమనుకుంటున్నావ్? ఫిల్మ్ మాఫియాలతో చేతులు కలిపి నా ఇంటిని కూలదోసి ప్రతీకారం తీర్చుకున్నానని అనుకున్నావా? ఇవాళ నా ఇల్లు కూలింది. రేపు నీకు గర్వభంగం అవుతుంది. ఇదంతా కాల మహిహ. గుర్తు పెట్టుకో" అని చాలా ఘాటుగానే స్పందించింది. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యే రిలీజైన ధాకడ్ మూవీ కంగనాకు భారీ షాకిచ్చింది.
ఈ సినిమాకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి కూడా వచ్చేసింది. కంగనా తన తర్వాతి సినిమా తేజస్లో కనిపించనుంది. ఇందులో ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఆమె కనిపించనుంది. ఇదే కాకుండా ఎమర్జెన్సీ మూవీలోనే నటిస్తోంది. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపిస్తోంది.