తెలుగు న్యూస్  /  బిజినెస్  /  India To Be World's 2nd Largest Economy: రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

India to be world's 2nd largest economy: రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

HT Telugu Desk HT Telugu

19 November 2022, 15:34 IST

  • India to be world's 2nd largest economy: 2050 నాటికి భారత దేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ తెలిపారు. 

ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ
ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ (AFP)

ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ

India to be world's 2nd largest economy: లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ మారడానికి దాదాపు 58 సంవత్సరాలు పట్టిందని ఆదానీ గుర్తుచేశారు. 2050 తరువాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందని, ప్రతీ 12 నుంచి 18 నెలలకు జీడీపీకి లక్ష ట్రిలియన్ డాలర్లను సమకూరుస్తుందని వెల్లడించారు.

World Congress of Accountants: వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్

వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్(World Congress of Accountants) ను ఉద్దేశించి ఆదానీ శనివారం ప్రసంగించారు. ప్రపంచం వరుసగా ఎదుర్కొన్న కీలక సవాళ్లు ప్రపంచ గతిని మార్చేశాయని, దశాబ్దాలుగా కొనసాగుతున్న కొన్ని అంచనాలను బద్దలు కొట్టాయని ఆదానీ వివరించారు. ‘చైనా పాశ్చాత్య ప్రజాస్వామ్య విధానాలను అనుసరిస్తుంది, ఈయూ ఎప్పటికీ ఐక్యంగా ఉంటుంది, అంతర్జాతీయంగా రష్యా ప్రాబల్యం తగ్గుతుంది’ వంటి అపోహలు తొలగిపోయాయని వ్యాఖ్యానించారు. ఏకధ్రువ, ద్వి ధ్రువ ప్రపంచాలనే అపోహలను కూడా ఈ వరుస సంక్షోభాలు తోసిపుచ్చాయని వివరించారు.

Multi polar world: ఇక బహుళ ధ్రువ ప్రపంచమే..

ఒక దేశమో, రెండు దేశాలో ప్రపంచాన్ని శాసించే పరిస్థితి ఇక ఉండదని ఆదానీ అభిప్రాయపడ్డారు. ముందుంది బహుల ధ్రువ ప్రపంచమేనన్నారు. ‘‘సంక్షోభ పరిస్థితుల్లో ముందుండి నడిపించే దేశమే.. కష్టాల్లో ఉన్న ఇతర దేశాలను ఆదుకునే దేశమే.. మానవాళి సంక్షేమమే ఎజెండాగా ఉన్న దేశమే.. సూపర్ పవర్ గా నిలుస్తుంది’’ అని స్పష్టం చేశారు. ఒక నిర్ధారిత ప్రజాస్వామ్య విధానమంటూ ఉండదని విశ్వసించే దేశమే సూపర్ పవర్ గా ఉంటుందన్నారు. ప్రజా సంక్షేమ కోణాన్ని పట్టించుకోని పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా ఎక్కువ కాలం నిలబడబోదని వివరించారు.

Govt policies driving the economy: ప్రభుత్వ విధానాలే…

రాజకీయంగా, పరిపాలన పరంగా భారత ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడ్డాయని ఆదానీ వివరించారు. లక్ష కోట్ల డాలర్ల(first trillion dollars) ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందడానికి 58 ఏళ్లు పట్టిందని, కాని రెండు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా(2 trillion dollars) మారడానికి 12 ఏళ్లు మాత్రమే పట్టిందని, అదే విధంగా, ఆ తరువాత ఐదేళ్లలోనే 3 లక్షల కోట్ల డాలర్ల(3 trillion dollars) ఎకానమీగా భారత్ మారిందని ఆదానీ అంచనా వేశారు. ప్రభుత్వం భారీగా తీసుకువస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణల కారణంగానే అది సాధ్యమవనుందని వివరించారు. ప్రస్తుతం భారత్ 3.5 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.