తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Airtel 5g Network: నెలలోపే 10లక్షల మంది యూజర్ల మార్క్ దాటిన ఎయిర్‍టెల్ 5జీ..

Airtel 5G network: నెలలోపే 10లక్షల మంది యూజర్ల మార్క్ దాటిన ఎయిర్‍టెల్ 5జీ..

HT Telugu Desk HT Telugu

02 November 2022, 16:54 IST

    • Airtel 5G network: ఎయిల్‍టెల్ 5జీ నెట్‍వర్క్ ఓ మైలురాయిని దాటింది. కమర్షియల్ 5జీని లాంచ్‍ చేసిన కొన్ని వారాల్లోనే 10 లక్షల మంది యూనిక్ యూజర్ల మార్క్‌ను అధిగమించింది.
5జీ సేవల్లో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్
5జీ సేవల్లో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ (REUTERS)

5జీ సేవల్లో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్

Airtel 5G network: 5జీ సర్వీస్‍ల్లో ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‍టెల్ దూసుకుపోతోంది. ఎయిర్‍టెల్ 5జీ యునీక్ యూజర్ల సంఖ్య 10 లక్షల మార్క్ దాటింది. కమర్షియల్ 5జీ నెట్‍వర్క్ ను లాంచ్ చేసిన 30 రోజుల్లోపే ఎయిర్‍టెల్ ఈ మైలురాయిను అధిగమించింది. దేశంలోని ఎనిమిది నగరాల్లో గత నెలలో 5జీ సర్వీస్‍లను ఎయిర్‍టెల్ లాంచ్ చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, సిలిగుడి, నాగ్‍పూర్, వారణాసి నగరాల్లో 5జీ నెట్‍వర్క్ ను అందుబాటులోకి తెచ్చింది.

5జీని లాంచ్ చేసిన నగరాల్లో నెట్‍వర్క్ ను విస్తరిస్తోన్నట్టు ఎయిర్‍టెల్ వెల్లడించింది. ఆ నగరాల్లో నెట్‍వర్క్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు దశల వారిగా రోల్ అవుట్ చేస్తున్నామని పేర్కొంది. "ఇవి ఇంకా తొలి రోజులే. అయితే యూజర్ల నుంచి వస్తున్న స్పందన చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మా నెట్‍వర్క్ ను ప్రతీ రోజూ విస్తరిస్తూనే ఉంటాం. కొన్ని 5జీ డివైజ్‍లు మినహా చాలా వరకు ఎయిర్‍టెల్ 5జీ నెట్‍‍వర్క్ కు సపోర్ట్ చేస్తున్నాయి. రానున్న వారాల్లో అన్ని 5జీ డివైజ్‍లు సపోర్ట్ చేస్తాయి" అని ఎయిర్‍టెల్ సీటీవో రణ్‍దీప్ సెఖోన్ చెప్పారు. దేశమంతా నెట్‍వర్క్ ను విస్తరించే విజన్‍తో ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు.

Airtel 5G : దేశంలోని 8 నగరాల్లో ప్రస్తుతం ఎయిర్‍టెల్ 5జీ నెట్‍వర్క్ అందుబాటులో ఉంది. 4జీ సిమ్‍కార్డులే 5జీకి కూడా సపోర్ట్ చేస్తున్నాయి. దీంతో 5జీ కోసం యూజర్లు సిమ్‍కార్డ్ మార్చాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వినియోగిస్తున్న 4జీ ప్లాన్‍లే 5జీ కూడా వర్తిస్తున్నాయి.

యాపిల్ ఐఫోన్స్ మినహా మిగిలిన 5జీ మొబైల్స్ అన్నీ ఈనెలలోనే తమ 5జీ నెట్‍వర్క్ కు సపోర్ట్ చేస్తాయని ఎయిర్‍టెల్ డైరెక్టర్, సీఈవో గోపాల్ విట్టల్ చెప్పారు. ఎయిర్‍టెల్ 5జీ ప్లస్‍కు ఎనేబుల్ చేసేలా ఈనెల 15వ తేదీలోగా 5జీ మొబైళ్లకు ఈనెలలోనే ఓటీఏ అప్‍డేట్స్ వస్తాయని సంకేతాలు ఇచ్చారు. ఇండియాలో 5జీకి సపోర్ట్ చేసేలా ఐఫోన్‍లకు అప్‍డేట్‍ను డిసెంబర్‍ నుంచి ఇవ్వనున్నట్టు యాపిల్ ఇప్పటికే వెల్లడించింది.

5జీ నెట్‍వర్క్ అందుబాటులోకి వచ్చిన నగరాల్లోనూ కొన్ని 5జీ మొబైల్స్ దీనికి సపోర్ట్ చేయలేదు. ఇందుకు కారణం అవి 5జీకి ఎనేబుల్‍గా లేకపోవడమే. ఇలాంటి 5జీ ఫోన్‍లకు కంపెనీలు క్రమంగా ఓటీఏ అప్‍డేట్‍లను ఇస్తున్నాయి. ఇప్పటికే చాలా 5జీ మొబైల్స్ ఈ కొత్త తరం నెట్‍వర్క్ కు సపోర్ట్ చేస్తున్నాయి. ఎనేబుల్ లేని వాటికి మొబైల్ తయారీ సంస్థలు అప్‍డేట్‍లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్లు మినహా మిగిలిన అన్ని 5జీ స్మార్ట్ ఫోన్లు తమ నెట్‍వర్క్ కు ఈనెలలోనే సపోర్ట్ చేస్తాయని ఎయిర్‍టెల్ చెబుతోంది.

మరోవైపు దేశంలోని అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) కూడా దేశంలోని నాలుగు నగరాల్లో ప్రస్తుతం 5జీ సేవలను అందిస్తోంది. ముంబై, ఢిల్లీ, వారణాసి, కోల్‍కతాలో అందుబాటులోకి తెచ్చింది. 5జీ సర్వీస్‍లను మరిన్ని నగరాలకు విస్తరించేందుకు జియో, ఎయిర్‍టెల్ ప్లాన్ చేసుకుంటున్నాయి. రెండు సంవత్సరాల్లోగా దేశమంతా 5జీ నెట్‍వర్క్ ను అందించాలని ప్రణాళిక రచించుకున్నాయి.