AP Weather Updates : రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం! మరో 3 రోజులు వర్షాలు
07 May 2023, 6:52 IST
- Weather Updates Telugu States: తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన ఇచ్చింది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో… పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
ఏపీకి వర్ష సూచన
Telugu States Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా... మరోసారి వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఐఎండీ అంచనాల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి కేంద్రీకృతమై ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం శనివారం ట్రోపో ఆవరణం వరకు విస్తరించింది. ఈ ఉపరితల ఆవర్తన మే 8వ తేదీ ఉదయం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ దిశగా కదిలి మే 9న తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ వాయుగుండం ఉత్తరం వైపు పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించవచ్చని తెలిపింది.
ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజులు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇవాళ చూస్తే అల్లూరి, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విప్తతుల శాఖ పేర్కొంది. రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుమలలో శనివారం జోరుగా కురిసిన వర్షంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.
ఇక తెలంగాణలో చూస్తే కూడా మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం పలు జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక అకాల వర్షాల దాటికి ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా భారీగా పంట నష్టం వాటిల్లింది. వరికోతకు సిద్ధంగా ఉన్న పంటలు ధ్వంసం అయ్యాయి. పలుచోట్ల మార్కెట్లలో ఉన్న ధాన్యం కూడా తడిసిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే తడిసిపోవటంతో రైతన్నలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. తమను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు రైతులకు పంట నష్టం అందించేందుకు ఇరు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే పంట నష్టం వివరాలను సేకరించింది. మరికొన్ని చోట్ల కొనసాగుతోంది.