AP Weather Updates: కొనసాగుతున్న ద్రోణి... మరో 3 రోజులు వర్షాలు, హెచ్చరికలు జారీ
Weather Updates: ఆంధ్రప్రదేశ్ కు మరోసారి వర్ష సూచన ఇచ్చింది వాతావరణశాఖ. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
Rain Alert to Andhrapradesh:Telugu States Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా... మరోసారి వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఐఎండీ అంచనాల ప్రకారం ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడొచ్చని, దీని ప్రభావంతో 7న అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే వీలుందని అంచనా వేసింది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో 8న వాయుగుండంగా కేంద్రీకృతమవుతుందని తెలిపింది.
ట్రెండింగ్ వార్తలు
ఐఎండీ అంచనాల ప్రకారం... దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆనుకుని ఉన్న తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు ఏపీ విపత్తుల శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది. ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్,శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటన విడుదల చేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
ఇక ఆదివారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తులశాఖ హెచ్చరించింది. వైఎస్ఆర్, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని... మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
ఇక రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కూడా వర్షాలు విస్తృతంగా కురిశాయి. పశ్చిమ గోదావరి, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. బాపట్ల జిల్లా కవురులో 8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అల్పపీడనం, వాయుగుండం హెచ్చరికల నేపథ్యంలో… మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని, వేటకు వెళ్లిన వారు శనివారంలోగా తిరిగి రావాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తమ కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటుచేసినట్లు ఆయన వివరించింది.