Hanumantha Vahanam : హనుమంత వాహనంపై వేంకటాద్రిరామునిగా శ్రీ మలయప్పస్వామి
02 October 2022, 12:12 IST
- శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధనుస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
హనుమంత వాహనంపై దర్శనమిస్తున్న మలయప్ప స్వామి
Hanumantha Vahanam శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధనుస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
హనుమంత వాహనం - భగవత్ భక్తి ప్రాప్తి
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణరథంపై శ్రీమలయప్ప స్వామివారు కటాక్షిస్తారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
వాహనసేవలలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్స్వామి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు.లలిత్, ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు శ్రీవారి వాహన సేవల్లో పాల్గొన్నారు. సీజే సతీమణ కళాకారులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో లక్షలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. కొండపై వాహనాలను నిలిపేందుకు ఖాళీ లేకపోవడంతో కొండపైకి ఆర్టీసి బస్సుల్లో మాత్రమే భక్తుల్ని అనుమతిస్తున్నారు.