Govt Teacher dies of Cardiac Arrest: గుండెపోటుతో టీచర్ మృతి.. పాఠాలు చెబుతూనే కుప్పకూలిపోయాడు
05 March 2023, 8:30 IST
- Bapatla district of Andhra Pradesh: ఏపీలోని బాపట్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తరగతి గదిలో పాఠాలు చెబుతుండగానే… ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో చనిపోయాడు.
బాపట్లలో విషాదం
Teacher dies of cardiac arrest in AP: గుండెపోటు కేసులు.... ఈ మధ్యకాలంలో అత్యధికంగా నమోదవుతున్నాయి. మన మధ్యలోనే ఉంటూ సంతోషంగా గడుపుతూ ఒక్కసారిగా పడిపోతున్నారు. కొందరు స్టేజీలపై డ్యాన్స్ లు, ప్రసంగాలు చేస్తూ కిందపడిపోయి చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక జిమ్స్ లో వర్కౌట్స్ చేస్తూ చనిపోతున్న ఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. అయితే తాజాగా ఏపీలోని బాపట్లలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. పాఠాలు చెప్పే తరగతి గదిలోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వాకావారిపాలెం ప్రాథమిక పాఠశాలలో శనివారం ఈ ఘటన జరిగింది. ప్రతిరోజూ మాదిరిగానే ఉదయం పాఠశాల ప్రారంభమైంది. ప్రార్థనా గీతం అనంతరం తరగతి గదిలో ఉపాధ్యాయుడు వీరబాబు (45) పాఠం మొదలు పెట్టాడు. ఇంతలోనే ఒక్కసారిగా కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. విద్యార్థుల కేకలతో తోటి ఉపాధ్యాయులు తరగతి గదిలోకి వచ్చారు. వెంటనే 108కు సమాచారం అందించగా వారు పరీక్షించి ఉపాధ్యాయుడు మృతి చెందినట్లు తెలిపారు. వీరబాబు భార్య కూడా ఇదే మండలంలోని కొండమూరులో ప్రాథమిక పాఠశాలలో టీచరగా పని చేస్తున్నారు. అప్పటివరకు తమతో మాట్లాడిన తోటి ఉపాధ్యాయుడు ఇకలేరని తెలియడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఇక కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జి వరుపుల రాజా గుండెపోటుతో చనిపోయారు. శనివారం రాత్రి ఉన్నట్టుండి ఆయనకు గుండె దగ్గర నొప్పి రావడంతో ఆయన్ను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా.. ఆయన కన్నుమూశారు. రాజా హఠాన్మరణంతో.. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. వరుపుల రాజా ప్రస్తుతం బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాలకు టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన... ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు. శనివారం కూడా ప్రచారం చేసి సాయంత్రానికి సొంతూరైన ప్రత్తిపాడు వెళ్లారు. ఆ తర్వాత కూడా బిజీగా గడిపారు. పార్టీ కార్యకర్తలు, బంధువుల మాట్లాడుతూ ఉండగా... రాత్రి 8 తర్వాత గుండె దగ్గర నొప్పి వచ్చింది. వెంటనే కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
అయితే ఈ మధ్య వరుసగా గుండెపోటు మరణాలు చోటు చేసుకోవటం ఆందోళన కలిగిస్తోంది. వయసు అనే తేడా లేకుండా… చిన్నా, పెద్ద అందరిలోనూ ఇది వస్తోంది. కరోనా తర్వాత… గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ అయినట్లు పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.