CM Jagan : గుంటూరు ట్రాక్టర్ బోల్తా ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
05 June 2023, 22:02 IST
- CM Jagan On Tractor Accident : గుంటూరు జిల్లా ట్రాక్టర్ బోల్తా ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
సీఎం జగన్
CM Jagan On Tractor Accident : గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ దురదృష్టకర ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. స్వల్ప గాయాలైన వారికి రూ. 25 వేలు సాయం అందించాలని బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ట్రాక్టర్ బోల్తా ఏడుగురు మహిళలు మృతి
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరులో ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు మార్గమధ్యలో మరణించారు. మొత్తం ఏడుగురు మహిళలు దుర్మరణం చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్కు తరలించారు. సుమారు 40 మంది చేబ్రోలు మండలం జూపూడికి శుభకార్యానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. బాధితులను ప్రత్తిపాడు మండలం కొండెపాడు వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదం తీవ్ర ఆవేదన కలిగించింది- పవన్
ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఏడుగురు మహిళలు దుర్మరణం చెందడం తీవ్ర ఆవేదన కలిగించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ ప్రార్థించారు. శుభకార్యానికి వెళ్తున్న బృందం ప్రమాదం బారిన పడటం బాధాకరమని పవన్ అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని పవన్ కోరారు.
కొండేపాటులో విషాదం
వట్టిచెరుకూరు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురి మృతదేహాలను స్వస్థలమైన ప్రత్తిపాడు మండలం కొండేపాటు తీసుకొచ్చారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం అలముకుంది. సోమవారం ఉదయం ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఏడుగురు మహిళలు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ప్రమాదంలో మిక్కిలి నాగమ్మ, మామిడి.జాన్సీరాణి, కట్టా.నిర్మల, గరికపూడి.మేరిమ్మ, గరికపూడి.రత్నకుమారి, గరికపూడి.సుహాసినీ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. శుభకార్యానికి బయలుదేరిన కుటుంబాల్లో ఈ ప్రమాదం కోలుకోలేని దెబ్బతీసింది.