Vizag Traffic Advisory : ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు....
12 November 2022, 8:59 IST
- Vizag Traffic Advisory ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రధాని సభకు 8,600 మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. ఆంధ్రా యూనివర్శిటీలో ఎస్పీ స్థాయి అధికారి సారథ్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
విశాఖలో ప్రధాని పర్యటన, భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
Vizag Traffic Advisory విశాఖలో ప్రధాని సభకు భారీగా జనం తరలి రానుండటంతో ఉదయం 8 నుంచి 11 మధ్య అత్యవసరమైతేనే బయటకు రావాలని పోలీసులు సూచించారు. ఆ సమయంలో ప్రధాని సభకు వెళ్లే ప్రజల వాహనాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. ప్రధాని సభకు వెళ్లే వాహనాలకు రూట్ మ్యాప్ ఇచ్చారు. వీటిని కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని సభకు వెళ్లే వీఐపీలకు గ్రీన్ ఛానల్ రూట్ ఏర్పాటు చేసినట్లు విశాఖపట్నం సీపీ శ్రీకాంత్ చెప్పారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండడంతో, బీజేపీ కూడా భారీగా జనసమీకరణ చేపట్టింది. సుమారు మూడు లక్షల మంది ప్రజలు సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. బస్సులు, రైళ్లు, ప్రత్యేక వాహనాల్లో జనాలను సభకు తరలిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే 1.10 లక్ష మందికి ఆహారం సిద్ధం చేస్తున్నారు.
ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ పరిసరాల్లో శనివారం సాధారణ వాహనాల రాకపోకల నిషేధం విధించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు శ్రీకాకుళం విజయనగరం నుంచి విశాఖ మీదుగా వెళ్లే వాహనాలను ఆనందపురం సబ్బవరం మీదుగా మళ్లిస్తారు.
అనకాపల్లి నుంచి శ్రీకాకుళం వెళ్లే వాహనాలు లంకెలపాలెం సబ్బవరం పెందుర్తి మీదుగా మళ్లిస్తారు.
శనివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు మద్దిలపాలెం, ఆంధ్రా యూనివర్సిటీ, పెదవాల్తేరు, కురుపాం సర్కిల్, స్వర్ణ భారతి స్టేడియం పరిసరాల్లో పూర్తిగా సాధారణ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. జ్ఞానాపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్ కు మార్కెట్ కమిటీ శనివారం సెలవు ప్రకటించింది.
నేడు విశాఖలో వాహనదారులకు సూచనలు....
శ్రీకాకుళం విజయనగరం జిల్లా నుంచి ప్రధాని సభకు వచ్చే వాహనాలు మారికవలస, . తిమ్మాపురం, కురుపాం సర్కిల్ నుంచి చిన వాల్తేరు మీదుగా ఏయూ గ్రౌండ్స్ చేరుకోవాల్సి ఉంటుంది.
భీమిలి నుంచి వచ్చే వాహనాలు మారివలస, తిమ్మాపురం, జోడుగులపాలెం, చిన్నవాల్తేరు మీదుగా కృష్ణదేవరాయలు అతిథి గృహానికి చేరుకోవాలి
మాడుగుల నుంచి వచ్చే రూట్ నెంబర్ 170 వాహనాలు పినగాడి, వేపగుంట, హనుమంతవాక, కళాభారతి మీదుగా ఏయూ గ్రౌండ్స్ కు చేరుకోవాల్సి ఉంటుంది.
పెందుర్తి ఎస్ కోట చోడవరం నుంచి వచ్చే వాహనాలు అడవివరం, శివాజీ పార్క్ మీదుగా రామలక్ష్మి అపార్ట్మెంట్ వద్ద ప్రజలను దించి వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
నర్సీపట్నం, పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి నుంచి వచ్చే వాహనాలు ఎన్ఎడి కొత్త రోడ్, తాటి చెట్ల పాలెం గురుద్వారా మీదుగా మద్దిలపాలెం వద్ద ప్రజలను దించాలి. అక్కడి నుంచి సభా వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.
విశాఖ సౌత్ నుంచి బయలుదేరే ప్రజలు జ్ఞానాపురం, ఫిషింగ్ హార్బర్, పార్క్ హోటల్ జంక్షన్ నుంచి చిన్న వాల్తేరు మీదుగా ఏయూ గ్రౌండ్స్ కి చేరుకోవాలి.
విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన ప్రజల వాహనాలు అప్పు ఘర్ మీదుగా ఆర్సీడీ ఆసుపత్రి వద్ద వాహనాలను పార్కింగ్ చేయాలి
వీఐపీలు తమ వాహనాలను నోవాటెల్, సర్క్యూట్ హౌస్, సెవెన్ హిల్స్ జంక్షన్, ఆసిల్ మెట్ట, స్వర్ణ భారతి స్టేడియం నుంచి మద్దిలపాలెం వద్ద ఏయూ గ్రౌండ్స్ కి చేరుకోవాలి.
టాపిక్