Rains in AP : మరో 2 రోజులు వర్షాలు.. తీర ప్రాంతానికి హెచ్చరికలు!
03 November 2022, 7:35 IST
- Rains in Telugu States: మరో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, తమిళనాడు, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో వర్షాలు కురవనున్నాయి.
ఏపీకి వర్ష సూచన
Weather Updates Telugu States : నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక తీరం, ఉత్తర శ్రీలంక తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో రానున్న రెండు రోజులపాటు ఉత్తర కోస్తాలోని పలుచోట్ల, దక్షిణ కోస్తా, సీమ ప్రాంతంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తీర ప్రాంతంలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మరోవైపు, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి మొదలైన వర్షం మంగళవారం వరకు కురుస్తూనే వచ్చింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. కావలి, వెంకటాపురం, కోవూరు, గూడూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట లో అత్యధికంగా వర్షాలు పడ్డాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సగటున 48.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ప్రకాశం, గుంటూరుజిల్లాలో పలుచోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి . దీంతో జనజీవనం స్థంభించిపోయింది.దీంతో జనజీవనం స్థంభించిపోయింది. తుఫాన్ నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురియనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. నెల్లూరు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు.
ఇక సముద్రతీరంలో వర్షాలతో చలి గాలులు, అలల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో తీరప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పలుచోట్ల అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. చిల్లకూరు, కోట, సూళ్లూరుపేట, వాకాడు మండలాలకు చెందిన మెరైన్ అధికారులు ఇప్పటికే తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. అలాగే లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Rains in Telangana: ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణశాఖ వివరాలను వెల్లడించింది. మరో రెండు మూడు రోజులు వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో గత అక్టోబర్ నెలలో సాధారణం కన్నా 49 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 817 మిల్లీమీటర్లు కాగా, 1217 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 72 శాతం, నారాయణపేట్లో 71 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా… ఖమ్మంలో అతితక్కువగా ఎనిమిది శాతం, సూర్యాపేటలో 17 శాతం, నల్లగొండలో 23 శాతం అధిక వర్షపాతం నమోదైంది.