Heat Wave Alert : ఏపీలో భానుడి భగభగలు... రాబోయే 3 రోజులు అధిక ఉష్ణోగ్రతలు, ఈ ప్రాంతాలకు హెచ్చరికలు
01 June 2023, 20:01 IST
- Weather Updates Of AP: ఏపీపై మళ్లీ భానుడి భగభగలు పెరుగుతున్నాయి. రోజురోజుకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఐఎండీ అంచనాల ఆధారంగా ఏపీ విపత్తుల శాఖ పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీకి హీట్ వేవ్ అలర్ట్
Andhrapradesh Temperatures: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ రోజురోజూకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. గత రెండు మూడు రోజులుగా పలుచోట్ల వర్షాలు కురిసినప్పటికీ... మళ్లీ ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉక్కపోత దాటికి ప్రజలు బెంబెలేత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(Andhra Pradesh State Disaster Management Authority) హెచ్చరికలు జారీ చేసింది. రాబోవు మూడు రోజులు కింద విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
రేపు కోనసీమ జిల్లాలోని పామర్రు మండలంలో తీవ్రవడగాల్పులు, 286 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎల్లుండి 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 300 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల సంస్థ,ఎండి, డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
గురువారం పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోటలో 44 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందివాడ, నంద్యాల జిల్లా మహానంది మండలంలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రలు రికార్డు అయ్యాయి. ఈ సీజన్ లో మే 16వ తేదీన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 46.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా గుండ్లపల్లిలో 46.7 డిగ్రీలు వరుసగా అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.
రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలోని 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక జూన్ 3వ తేదీన విజయనగర, పార్వతీపురం, అల్లారు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటుూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల కు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే ఛాన్స్ ఉంది. జూన్ 4వ తేదీన విజయనగరం, పార్వతీపురం, అల్లూరిసీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 - 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.