YCP vs Janasena: విశాఖలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై రాళ్ల దాడి..!
15 October 2022, 17:47 IST
- విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతలపై జనసేన కార్యకర్తలు రాళ్లు రువ్వటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఘటనపై మంత్రులు తీవ్రంగా స్పందించారు.
విశాఖలో ఉద్రిక్త పరిస్థితి
high tension at visakhapatnam airport: విశాఖ గర్జన నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి విశాఖపట్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఓవైపు అధికారపక్షం భారీ ర్యాలీ... మరోవైపు టీడీపీ, జనసేన సమావేశాలు తలపెట్టడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టైన్షన్ నెలకొంది. అయితే గర్జన ర్యాలీ ప్రశాంతంగా ముగిసినప్పటికీ... విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
నేతలపై రాళ్ల దాడి...!
కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వెళ్తున్న క్రమంలో ఎయిర్ పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు రోజా, జోగి రమేష్ కార్లపై దాడులకు అద్దాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. మంత్రుల సిబ్బందిలో ఒకరికి తల పగిలినట్లుసమాచారం.
జోగి రమేశ్ ఫైర్...
ఈ ఘటనపై మంత్రి జోగి రమేశ్ తీవ్రంగా స్పందించారు. జనసేన కార్యకర్తలు తమపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో తమవాళ్లకు గాయాలయ్యాయని తెలిపారు. ఇది మంచి పద్ధతి కాదన్న ఆయన... తమ కార్యకర్తలు తలుచుకుంటే పవన్ ఎక్కడా తిరగలేరని హెచ్చరించారు.
పవన్ దే బాధ్యత- మంత్రి గుడివాడ
రాళ్ల దాడికి పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని మంత్రి గుడివాడ అమర్ నాథ్ డిమాండ్ చేశారు. జనసేన వీర మహిళలు, కార్యకర్తలు బాధ్యతరహిత్యంగా ప్రవర్తించాలని... వెంటనే పవన్ క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ దాడి తమ ఉద్యమంపై చేసినట్లుగా భావిస్తున్నామని అన్నారు.
ఈ దాడికి పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు కూడా డిమాండ్ చేశారు. ఇలాంటి దాడిలను ఉపేక్షించమని తేల్చి చెప్పారు. పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఈ తరహా దాడులు జరిగాయని ఆరోపించారు.
విశాఖ చేరుకున్న పవన్…
pawan visakha tour: మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.