CM Jagan : నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
01 August 2022, 17:53 IST
- గృహ నిర్మాణాలు వేగవంతంగా ముందుకు సాగాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి ప్రాధానత్య ఇవ్వాలని సూచించారు. కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టిపెట్టాలని చెప్పారు.
సీఎం జగన్
గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేశారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం సమీక్షించారు. విశాఖలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణ పనులపై జగన్ ఆరా తీశారు. కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టిపెట్టాలన్నారు.
ఆప్షన్ మూడు కింద ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఇళ్ల నిర్మాణంతోపాటు.. కాలనీల్లో సమాంతరంగా మౌలిక సదుపాయాల కల్పనా పనులపైన దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. డ్రైనేజీ, నీళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నారు. కాలనీల్లో పనుల ప్రగతి సమీక్షించడానికి, సందేహాల నివృత్తికి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని అక్కడ నుంచే ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు.
'ప్రత్యేకించి ఒక ఫోన్ నంబర్ను కూడా అందుబాటులో ఉంచాలి. పట్టా ఇవ్వడంతోపాటుగా లబ్ధిదారుడి స్థలం ఎక్కడ ఉందో కూడా చూపించాలి. గృహనిర్మాణ పనులు వేగవంతంగా ముందుకు సాగాలి. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. చేసిన పనులకు నిధులుకూడా సక్రమంగా విడుదల చేస్తున్నాం. విశాఖలో ఇచ్చిన ఇళ్ల నిర్మాణపనులు కూడా వేగంగా జరగాలి.' అని సీఎం జగన్ ఆదేశించారు.
టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రగతినీ ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. పూర్తి మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు ఇళ్లు అందించాలన్నారు. 15–20 రోజుల్లో మొత్తం 1.4 లక్షల ఇళ్లు సర్వం సిద్ధం అవుతున్నాయని అధికారులు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి 2,03,920 మందిని కొత్తగా తేల్చామన్నారు. వీరిలో ఇప్పటికే లక్షమందికి పట్టాలు అందించామన్న అధికారులు.. మిగతావారికీ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని ఆదేశించారు. వీటి నిర్వహణ బాగుండేలా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. 90 రోజుల్లో ఇంటిపట్టా కార్యక్రమాన్ని సీఎం సమీక్షించారు.