AP High Court: అది మాత్రమే తేల్చాలి.. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్పై హైకోర్టు కీలక తీర్పు
15 January 2023, 7:10 IST
- AP HC On Family Member Certificate: ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఓ కేసుపై విచారించిన కోర్టు.. కుటుంబ సభ్యులా.. కాదా? అనేదే తేల్చాలని స్పష్టం చేసింది. గతంలో ఉన్న ప్రభుత్వ జోవోను సమీక్షించాలని సర్కార్ ను ఆదేశించింది.
ఏపీ హైకోర్టు కీలక తీర్పు
ap high court key verdict:ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ కుటుంబ సభ్యులా? కాదా? అనే వ్యవహారం వరకే పరిమితం కావాలని స్పష్టం చేసింది. అలా కాకుండా ఇతర కారణాలతో సర్టిఫికెట్ మంజూరు చేయకుండా ఉండొదని ఆదేశించింది. ధ్రువపత్రం జారీకి ఇబ్బందులు కలిగిస్తున్న జీవో 145ను సవరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ కీలక తీర్పు ఇచ్చారు. ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు... వెంటనే ఆమెకు సర్టిఫికెట్ మంజూరు చేయాలని ఆదేశించింది.
కేసు నేపథ్యం ఇదీ...
విశాఖ చెందిన జ్యోతి ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఆమె భర్త అయిన బంగార్రాజు విశాఖ మహిళా కోర్టులో అటెండర్గా పనిచేసేవాడు. అయితే జ్యోతిని పెళ్లి చేసుకున్న ఏడాదిన్నర తర్వాత కొవిడ్ కారణంగా చనిపోయాడు. దీంతో కారుణ్య నియామకం కోసం భార్య అయిన జ్యోతి జిల్లా జడ్జికి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుతో పాటు ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసంమాకవరపాలెం తహసీల్దార్కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై బంగార్రాజు తల్లి అభ్యంతరం వ్యక్తి చేసింది. కోడలి అయిన జ్యోతికి సర్టిఫికెట్ మంజూరు చేయవవద్దని స్థానిక తహసీల్దార్కు లిఖితపూర్వక అభ్యంతరం ఇచ్చింది. బంగార్రాజు మరణానంతర ఆర్థిక ప్రయోజనాల్లో 75 శాతం ఇవ్వడంతో పాటు ఇంటిపైన, ఎకరా భూమిపైన హక్కును వదులుకుంటేనే జ్యోతికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు ‘నో అబ్జక్షన్’ ఇస్తానని వరహాలమ్మ ఇందులో పేర్కొంది. అత్త ఫిర్యాదులో కోడలు జ్యోతికి సర్టిఫికెట్ మంజూరు కాలేదు.
జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించారు జ్యోతి. అయినా ప్రయోజనం లేకపోవడంతో చివరిగా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై విచారించిన కోర్టు... ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ విషయంలో 2017లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమికస్ క్యూరీ ఒ.మనోహర్రెడ్డి వివరించారు. ఈ సర్టిఫికెట్ జారీకి ఉద్దేశించిన జీవో 145ను న్యాయమూర్తి పరిశీలించారు. కుటుంబ సభ్యుల్లో ఎవరూ అభ్యంతరం చెప్పకపోతేనే సర్టిఫికేట్ ఇవ్వాలన్న నిబంధనపై అభ్యంతరం తెలిపారు. విచారణ సమయంలో దరఖాస్తు గురించి సదరు కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకొచ్చి, దరఖాస్తుదారు వారి కుటుంబ సభ్యుడా? కాదా? అన్న విషయాన్ని తేల్చేందుకే ఆ నిబంధనను ఉపయోగించాలి తప్ప, మరో ప్రయోజనం కోసం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ జీవో విషయంలో మరింత స్పష్టత ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ధ్రువపత్రం జారీకి ఇబ్బందులు కలిగిస్తున్న జీవో 145ను సవరించాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.