AP DSPs Transfers : ఏపీలో మరో 50 మంది డీఎస్పీలు బదిలీ, రెండ్రోజుల్లోనే ఒంగోలు డీఎస్పీ ట్రాన్స్ ఫర్
06 May 2023, 13:42 IST
- AP DSPs Transfers : ఏపీలో మరోసారి భారీగా డీఎస్పీ బదిలీలు జరిగాయి. మరో 50 మంది డీఎస్పీలు ట్రాన్స్ ఫర్ చేస్తూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
AP DSPs Transfers : ఏపీలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఇటీవల 77 మంది డీఎస్పీలు బదిలీ చేయగా... శనివారం మరో 50 మంది డీఎస్పీలను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ చేశారు. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సర్కార్ కీలక పోస్టింగులలో బదిలీలు చేపట్టింది. వారం క్రితం(ఏప్రిల్ 26)న ఏడుగురు ఐపీఎస్ అధికారులతో సహా 77 మంది డీఎస్పీలను 55 పోలీస్ సబ్ డివిజన్లకు బదిలీ చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిని బదిలీ చేసి ఆ స్థానాల్లో వేరే వారిని సబ్ డివిజనల్ పోలీస్ అధికారులుగా, ఏసీపీ, ఎస్పీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా మరో 50 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
రెండ్రోజుల్లోనే బదిలీ
రాష్ట్రంలో 50 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. బదిలీతో పాటు పోస్టింగ్ వచ్చిన అధికారులు తక్షణమే విధుల్లో చేరాలని డీజీపీ ఆదేశించారు. ఒంగోలు డీఎస్పీగా చేరిన రెండు రోజుల్లోనే అశోక్ వర్దన్ మరోసారి బదిలీ అయ్యారు. ఆయనను దర్శి డీఎస్పీగా బదిలీ చేశారు. ఒంగోలు డీఎస్పీగా నారాయణస్వామి రెడ్డిని నియమించగా...మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరుకున్న హరినాథ్ రెడ్డిని కూడా అనంతపురం పీటీసీకి బదిలీ చేశారు. కనిగిరి డీఎస్పీగా రామరాజును నియమించారు. అమలాపురం ఎస్డీపీవోగా అంబికా ప్రసాద్, ఏసీబీ డీఎస్పీగా ఉన్న ఎస్ఆర్కే ప్రసాద్ను రామచంద్రాపురం ఎస్డీపీవోగా బదిలీ చేశారు. అదేవిధంగా వెయిటింగ్లో ఉన్న 24 మంది డీఎస్పీలను వేర్వేరు చోట్ల పోస్టింగ్ ఇచ్చారు.
పంతం నెగ్గించుకున్న బాలినేని
గత కొంతకాలంగా వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. ఒంగోలు డీఎస్పీగా అశోక్ వర్దన్ను నియమించడంపై బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయనను బుజ్జగించేందుకు వైసీపీ ప్రభుత్వం అశోక్ వర్దన్ను అక్కడి నుంచి బదిలీ చేసింది. ఒంగోలు డీఎస్పీగా నారాయణ స్వామి నియమితులయ్యారు. దీంతో బాలినేని తన పంతం నెగ్గించుకున్నారనే మాట వినిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో పాలనా వ్యవహారాలపై తనకు సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని అధిష్ఠానంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నేరుగా మీడియా ముందు సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దీంతో పార్టీలో చర్చకు దారి తీసింది. బాలినేని అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండ్రోజుల క్రితం నియమించిన డీఎస్పీని మార్చి మరొకరికి బాధ్యతలు అప్పగించారు. దీంతో బాలినేని పంతం నెగ్గించుకున్నట్లు అయింది.