Cancer: అరుదైన క్యాన్సర్‌తో మరణించిన అందాల సుందరి, ఈ క్యాన్సర్ మహిళలకు ఎప్పుడైనా రావచ్చు-rinky chakma died of a rare cancer a cancer that can strike women at any time ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cancer: అరుదైన క్యాన్సర్‌తో మరణించిన అందాల సుందరి, ఈ క్యాన్సర్ మహిళలకు ఎప్పుడైనా రావచ్చు

Cancer: అరుదైన క్యాన్సర్‌తో మరణించిన అందాల సుందరి, ఈ క్యాన్సర్ మహిళలకు ఎప్పుడైనా రావచ్చు

Haritha Chappa HT Telugu
Mar 01, 2024 02:00 PM IST

Cancer: క్యాన్సర్ తో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వస్తోంది. మిస్ ఇండియా త్రిపురగా ఎంపికైన ఓ అందాల సుందరి అరుదైన రొమ్ము క్యాన్సర్ తో మరణించింది.

క్యాన్సర్‌తో మరణించిన మిస్ ఇండియా త్రిపుర
క్యాన్సర్‌తో మరణించిన మిస్ ఇండియా త్రిపుర

Cancer: 2017లో మిస్ ఇండియా త్రిపురగా గెలిచింది రింకీ చక్మా. ఆమె గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. చివరికి ఆ క్యాన్సర్ ఆమె ప్రాణాలను తీసేసింది. ఆమెకు ప్రాణాంతకమైన ఫిలోడస్ ట్యూమర్ బారిన పడింది. ఇది ఒక రొమ్ము క్యాన్సర్. దీనికి శాస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ క్యాన్సర్ కణితులు అదుపులోకి రాలేదు. రొమ్ము నుంచి ఊపిరితిత్తులకు క్యాన్సర్ వ్యాపించింది. అక్కడ నుంచి మెదడుకు వ్యాపించి బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడింది. దీంతో ఆమె 28 ఏళ్ళ వయసులోనే మరణించింది.

రింకీ చక్మా ప్రాణాలు తీసిన రొమ్ము క్యాన్సర్ ఫిలోడస్ ట్యూమర్ గురించి ప్రతి మహిళా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తుంది. రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము కణాలలో ఉత్పన్నమయ్యే క్యాన్సర్. రొమ్ము నాళాలలో లేదా పాలు ఉత్పత్తి అయ్యే గ్రంథుల్లో... ఎక్కడైనా కూడా రొమ్ము కణజాలం పెరగవచ్చు. అది కొన్ని రోజులకు రొమ్ము క్యాన్సర్ గా మారుతుంది.

రొమ్ము క్యాన్సర్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో అరుదైనది ఫిలోడస్ ట్యూమర్. ఇది రొమ్ములోని బంధన కణజాలంలో పెరుగుతుంది. సాధారణంగా ఈ కణితులు ఏర్పడినా కూడా ప్రాణాపాయాన్ని కలుగజేయవు. కానీ వాటిలో కొన్ని మాత్రం తీవ్రంగా మారుతాయి. ఆ క్యాన్సర్ ఇతర అవయవాలకు సోకి ప్రాణాలను తోడేస్తుంది.

రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది?

రొమ్ము క్యాన్సర్ రావడానికి అనేక ప్రమాద కారకాలు ఉన్నాయి. వ్యక్తుల వయసు పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అలాగే ఏ మహిళలైతే అధిక మొత్తంలో ఆల్కహాల్‌ను తాగుతారో వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. రొమ్ము కణజాలం ఒకే చోట దట్టంగా పేరుకుపోయినా అది క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది. కాబట్టి మీకు రొమ్ముల్లో ఎక్కడైనా చేతికి గట్టిగా తగిలితే వెంటనే మామోగ్రామ్ వంటి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. రొమ్ము క్యాన్సర్ వారసత్వంగా వస్తుంది. జన్యు ఉత్పరివర్తనాల ద్వారా కూడా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా 12 ఏళ్ళ వయసులో ఋతుచక్రం మొదలైన ఆడపిల్లల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే 55 ఏళ్లు దాటిన మహిళల్లో మెనోపాజ్ రాకపోతే అలాంటి స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి .

క్యాన్సర్ చికిత్స

రొమ్ము క్యాన్సర్ సోకిన వారిలో రేడియేషన్ థెరపీ, కీమో థెరపీ, హార్మోన్ చికిత్సల ద్వారా క్యాన్సర్‌ను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. రేడియేషన్ థెరపీలో క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకొని రేడియేషన్ కిరణాలు పనిచేస్తాయి. క్యాన్సర్ కణాలను రేడియేషన్ థెరపీలో చంపేందుకు వినియోగిస్తారు. కీమోథెరపీ మందుల ద్వారా క్యాన్సర్ కణాలను చంపే పద్ధతి. అలాగే హార్మోన్ చికిత్సలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనే రెండు స్త్రీ హార్మోన్ల ద్వారా చికిత్స చేసేందుకు ప్రయత్నిస్తారు. వీటితో క్యాన్సర్ అదుపులోకి రాకపోతే క్యాన్సర్ సోకిన రొమ్మును తొలగిస్తారు. ఒక్కసారి క్యాన్సర్ సోకితే జీవితమంతా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎప్పుడైనా అది తిరగబడే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర అవయవాలకు సోకే ప్రమాదం కూడా ఉంది.

WhatsApp channel

టాపిక్