Tirumala Vision 2047 : 'తిరుమల విజన్‌-2047’ - ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ, లక్ష్యాలివే-ttd has announced the initiation of tirumala vision 2047details read here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Vision 2047 : 'తిరుమల విజన్‌-2047’ - ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ, లక్ష్యాలివే

Tirumala Vision 2047 : 'తిరుమల విజన్‌-2047’ - ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ, లక్ష్యాలివే

TTD Tirumala Vision-2047 : తిరుమల విజన్‌-2047 కోసం టీటీడీ ప్రతిపాదనలు ఆహ్వానించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. “స్వ‌ర్ణాంధ్ర‌ విజన్ – 2047″కి అనుగుణంగా తిరుమలలో కూడా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం లక్ష్యాలను నిర్ణయించారు.

తిరుమల విజన్ – 2047 - టీటీడీ కీలక ప్రకటన

“స్వ‌ర్ణాంధ్ర‌ విజన్ – 2047″కి అనుగుణంగా తిరుమలలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం టీటీడీ ప్రతిపాదనల‌ను ఆహ్వానించింది. పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే వ్యూహాత్మక ప్ర‌ణాళిక‌తో “తిరుమల విజన్ – 2047” ను టీటీడీ ప్రారంభించింది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల‌ కోసం ఆర్ఎఫ్‌పీని విడుదల చేసింది.

ఇటీవ‌ల తిరుమ‌ల‌లో జ‌రిగిన‌ సమావేశంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించాల‌ని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. ఇదే కాకుండా….“స్వ‌ర్ణాంధ్ర‌ విజన్ – 2047″కి అనుగుణంగా… తిరుమలలో కూడా అభివృద్ధి పనులు చేసేందుకు టీటీడీ సిద్ధమైంది.

విజన్ డాక్యుమెంట్-2047 లక్ష్యాలు:

  • ఆధునిక పట్టణ ప్రణాళిక నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ తిరుమల‌ పవిత్రతను పెంపొందించేందుకు శాశ్వ‌త‌మైన వ్యూహాలను అమ‌లు చేయ‌డం.
  • ఉత్త‌మ‌మైన ప్ర‌ణాళిక‌లు, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడం.
  • ప్ర‌పంచవ్యాప్తంగా తిరుమ‌ల‌ను రోల్ మోడ‌ల్‌గా తీర్చిదిద్దేందుకు టీటీడీ ప్రయత్నిస్తుంది.
  • తిరుమల విజన్ 2047 లక్ష్యాలను చేరుకునేందుకు, పట్టణ ప్రణాళిక, ఆర్కిటెక్చ‌ర్‌, ఇంజినీరింగ్‌, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణపై ప్ర‌త్యేక నైపుణ్యం కలిగిన ఏజెన్సీల నుండి ప్రతిపాదనలను టీటీడీ ఆహ్వానిస్తోంది.
  • ‍తిరుమల అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేయడం.
  • ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జోనల్ అభివృద్ధి ప్రణాళికను సవరించడం.
  • తిరుమలలోని ప‌విత్ర‌త‌ను కాపాడుతూ భ‌క్తుల‌ సౌకర్యాలను మెరుగుపరచడానికి భ‌విష్య‌ వ్యూహాలను రూపొందించడం.
  • ప్రాముఖ్య‌త క‌లిగిన‌ మౌలిక సదుపాయాలపై కార్యాచరణ ప్రణాళికలను త‌యారు చేయ‌డం.

ప్ర‌తిపాద‌న‌ల‌కు గ‌డువు - ప్ర‌ణాళిక ల‌క్ష్యాలు

మూడు వారాల్లోగా ఆసక్తి గల ఏజెన్సీలు తమ ప్రతిపాదనలను సమర్పించాలని టీటీడీ కోరింది. ఇలాంటి భారీస్థాయి పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఏజెన్సీలకు ముంద‌స్తు అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి అని స్పష్టం చేసింది.

వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణ, ఆధునిక పట్టణ ప్రణాళికలను మిళితం చేసే ఒక బృహుత్త‌ర భవిష్య ప్ర‌ణాళికల‌ను రూపొందించ‌డం లక్ష్యాలుగా నిర్ణయించారు. అంతేకాకుండా తిరుమలలో రాబోవు త‌రాల్లో మ‌రింత‌గా ఆధ్యాత్మిక, సాంస్కృతిక పవిత్రతను కాపాడట‌మే ఈ ప్రణాళిక‌ లక్ష్యమని టీడీడీ పేర్కొంది.

సంబంధిత కథనం