20న ఉద్ధవ్ థాకరేతో కేసీఆర్ సమావేశం
16 February 2022, 11:23 IST
- ఈ నెల 20 తేదీ న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సమావేశం కానున్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే (ఫైల్ ఫోటో)
బీజేపీని గద్దె దింపాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈనెల 20 తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు భేటీ కానున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు.
ముంబై కి రావాలని, తన ఆతిథ్యాన్ని అందుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు. బుధవారం సీఎం కేసీఆర్కు ఫోన్ చేసిన ఉద్ధవ్ థాకరే, దేశం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.
బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, సమాఖ్య స్వరూపానికి న్యాయం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి ఉద్ధవ్ థాకరే తన సంపూర్ణ మద్దతును పలికారు.
ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి..
ఈ సందర్భంగా థాకరే మాట్లాడుతూ.. ‘కేసీఆర్ జీ.. మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం..’ అంటూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
‘మిమ్మల్ని ముంబైకి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. అదే సందర్భంలో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందాం..’ అని సీఎం కేసీఆర్ను ఉద్ధవ్ థాకరే ఆహ్వానించారు.