Khadeer Khan custodial death: ఖదీర్ఖాన్ లాకప్ డెత్పై హైకోర్టు విచారణ
22 February 2023, 9:03 IST
- Khadeer Khan custodial death చోరీ చేశాడనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని హింసించడంతో వ్యక్తి చనిపోయిన ఘటనపై తెలంగాణ హైకోర్టు సుమోటో విచారణ చేపట్టింది. ఈ ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మెదక్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని హింసించడంతోనే ఖదీర్ ఖాన్ చనిపోయాడనే ఆరోపణలపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
మెదక్ కస్టడీ మరణంపై తెలంగాణ హైకోర్టు సుమోటో విచారణ
Khadeer Khan custodial death మెదక్ జిల్లా పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తిని చిత్ర హింసలకు గురి చేయడంతో, దెబ్బలకు తాళలేక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన ఘటనలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పత్రికలు, టీవీల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మెదక్కు చెందిన చిరు వ్యాపారి ఖదీర్ఖాన్ను కస్టడీలో విచారణ పేరుతో తీవ్రంగా కొట్టడంతో అనారోగ్యానికి గురయ్యాడు.
జనవరి 29న మెదక్ జిల్లా పోలీసులు ఖదీర్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మెదక్ పోలీస్ స్టేషన్లో ఉంచి చిత్ర హింసలకు గురి చేశారు. ఆ తర్వాత నడవలేని స్థితికి చేరిన బాధితుడిని ఇంటి దగ్గర వదిలేశారు. ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అతని పరిస్థితి విషమంగా మారడంతో జనవరి 12న సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ జనవరి 16న ఖదీర్ ఖాన్ చనిపోయాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పలు వీడియోలలో పోలీసులు తనను ఎలా హింసించారో వివరించాడు. ఇవి మీడియాలో వైరల్ అయ్యాయి. చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించినా పోలీసులు తనను దారుణంగా హింసించారని వాపోయాడు. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం సుమోటో విచారణ చేపట్టింది.
ఈ ఘటనపై విచారణ సందర్భంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ జే.రామ చంద్ర రావు వాదనలు వినిపించారు. నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరు పరిచిన 14 రోజుల తర్వాత చనిపోయాడని వాదించారు.పోలీసులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని మృతుడి భార్య ఆరోపిస్తోందని, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మెదక్ ఎస్పీ, సిఐలకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కేసు విచారణను మార్చి 14వ తేదీకి వాయిదా వేశారు.
పోలీస్ కస్టడీలోఅనుమానితుడు మృతిచెందడంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో విచారన జరుపుతున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా మెదక్ సిఐ,ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. మరోవైపు భర్త మృతికి పరిహారంగా రూ.50లక్షల పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మృతుడి భార్యహైకోర్టును ఆశ్రయించారు.
ఖదీర్ ఖాన్ భార్య సిద్దేశ్వరి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విజయ్సేన్ రెడ్డి విచారించారు. ఘటనపై సిట్ దర్యాప్తు ఏర్పాటు చేయాలని, స్టేషన్ సిసిటివి ఫుటేజీని భద్రపరచాలని ఖదీర్ ఖాన్ భార్య పోలీసుల్ని కోరింది. అప్పటికే సీజే ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాది వివరించడంతో సుమోటో పిటిషన్తో మృతుడి భార్య పిటిషన్ జత చేయాలని సూచించారు.