Fraud: ఇన్స్టాగ్రామ్ తో ఎంట్రీ.. రూ. 4 కోట్ల మోసం, అంతా అమ్మాయిలే
16 July 2022, 15:43 IST
- ఫేక్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలతో యువతులు,మహిళను మోసం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. కీలక విషయాలను రాబట్టారు.
ఇన్స్టాగ్రామ్లో వల.
online fraud through instagram: తప్పుడు వివరాలతో ఇన్స్టాగ్రామ్లో ఖాతాలు తెరిచాడు. వీర లెవల్ లో ఫోజులిచ్చాడు. సీన్ కట్ చేస్తే ఏకంగా 60 మందికిపైగా అమ్మాయిలను బుట్టలో వేసుకున్నాడు. రూ.4 కోట్ల వరకు వసూలు చేశాడు. ఓ అమ్మాయి ఫిర్యాదుతో ఇతగాడి కథంతా బయటికి వచ్చింది. సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన వంశీకృష్ణను పీటీ వారెంట్పై కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విచారణ పూర్తి కావడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం తిరిగి జైలుకు తరలించారు.
వంశీకృష్ణ... ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన ఇతను బీటెక్ పూర్తి చేశాడు. 2014లో నగరానికి వలసవచ్చి రెండేళ్ల పాటు కూకట్పల్లిలోని ఓ ట్రావెల్స్ కన్సల్టెన్సీలోనూ పని చేశాడు. క్రికెట్ బెట్టింగ్స్తో పాటు రేసులకు అలవాటు పడ్డాడు. 2017లో నకిలీ ఉద్యోగాల విషయంలో కేసు కూడా నమోదైంది. ఇతడిపై రాచకొండ కమిషనరేట్తో పాటు ఏపీలోని ఉభయ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు, రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు.
ఫేక్ ఉద్యోగాల విషయం బెడిసి కొట్టడంతో ఈసారి సరికొత్త స్టెల్ లో వచ్చాడు. యువతుల పేర్లతో ఇన్స్టాగ్రామ్లో ఖాతాలు తెరిచాడు. వీటి ద్వారానే అనేక మంది యువతులు, మహిళలతో ఫ్రెండ్ షిప్ చేసుకున్నాడు. వీరితో సంపన్నమైన వ్యక్తిగా మెలిగాడు. సోషల్ సర్వీస్ చేస్తానంటూ ఫోజులు కూడా కొట్టాడు. ఇలా చాలా మందిని తన వలలో వేసుకున్నాడు ఈ వంశీకృష్ణ. తన వలలో పడిన సంపన్న వర్గాలకు చెందిన యువతుల నుంచి సేవా కార్యక్రమాలు, పేదలకు ఉపాధి కలి్పంచే అంశాల పేరుతో డబ్బు దండుకునే వాడు. ఇలా దాదాపు 60 మంది నుంచి రూ.4 కోట్ల వరకు కాజేశాడు.