MLC Kavitha Letter: పాత ఫోన్లు ప్రదర్శించిన ఎమ్మెల్సీ కవిత..రెండో రోజు విచారణ
21 March 2023, 12:20 IST
MLC Kavitha Letter: ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత రెండో రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. సోమవారం రోజంతా విచారించిన కవిత మంగళవారం కూడా విచారణకు హాజరయ్యారు. విచారణకు వెళ్లే ముందు గతంలో వాడిన పాత ఫోన్లను కవిత ప్రదర్శించారు.
మొబైల్ ఫోన్లను ప్రదర్శిస్తున్న ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha Letter: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు కవిత న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. విచారణను ఎలా ఎదుర్కొవాలనే విషయంలో న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలుస్తోంది. వరుసగా రెండో రోజు కవితను విచారణకు పిలవడంపై ఉత్కంఠ నెలకొంది. ఈడీ విచారణకు హాజరయ్యే ముందు గతంలో తాను వినియోగించిన మొబైల్ ఫోన్లను ఎమ్మెల్సీ కవిత ప్రదర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆధారాలను మాయం చేసేందుకు కవిత ప్రయత్నించారనే ఆరోపణల నేపథ్యంలో ఫోన్లను ధ్వంసం చేయలేదని సందేశాన్నిస్తూ కవిత పాత ఫోన్లు ప్రదర్శించారు.
ఈడీ దర్యాప్తు అధికారికి కవిత లేఖ…
ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్ర కు కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. గత ఏడాది నవంబర్లోనే ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ దుష్ప్రచారం చేశారని కవిత ఆరోపించారు. ఫోన్లు ధ్వంసం చేశారని ఆరోపించడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన కవిత, ఈడీ దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ తాను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ఒక మహిళ ఫోన్ స్వాధీనం చేసుకోవడం, ఆమె గోప్యత హక్కుకు భంగం కలగదా అని ప్రశ్నించారు. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ, ఫోన్లను తాను ధ్వంసం చేశానని ఆరోపించారని లేఖలో కవిత పేర్కొన్నారు. తనకు కనీసం సమన్లు కూడా అడగకుండానే, ఫోన్లు ధ్వంసం చేశారని, ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఆరోపణలు చేసిందని కవిత ప్రశ్నించారు.
తొలిసారి ఈ ఏడాది మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచిందని, గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడి ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమేనని కవిత ఆరోపించారు. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం ద్వారా రాజకీయ ప్రత్యర్థులు తనను ప్రజల్లో నిందిస్తున్నారని కవిత లేఖలో పేర్కొన్నారు.
తన వ్యక్తిగత ప్రతిష్టకు తీవ్రంగా భంగం కలగించడమే కాకుండా తన పరువును, పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందని కవిత ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడి వంటి ప్రభుత్వ దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలనే ప్రాథమిక విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరమని కవిత ఆరోపించారు.