Congress Expels Shashidhar Reddy: మర్రి శశిధర్ రెడ్డిపై బహిష్కరణ వేటు
19 November 2022, 18:36 IST
- Marri Shashidhar Reddy Suspended: మాజీమంత్రి మర్రి శశిధర్రెడ్డి పై కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.
మర్రి శశిధర్ రెడ్డి
Marri Shashidhar Reddy Suspended From Congress: సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డిపై కాంగ్రెస్ అధినాయకత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలవటంతో పాటు... పార్టీపై సీరియస్ కామెంట్స్ చేయటాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు పార్టీకి క్యాన్సర్ సోకిందన్న వ్యాఖ్యలపై టీపీసీసీ చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై క్రమశిక్షణా సంఘం ఆరేళ్ల పాటు ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటు, బండి సంజయ్, డీకే అరుణతో కలిసి బీజేపీ పెద్దలను కలవడం.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగా భావించి చర్యలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
ఇక ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయం చేయలేని స్థితికి చేరుకుందన్నారు. ఒక హోమ్ గార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే పోయేదేమీ లేదన్నారు.
మరోవైపు మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా పేరుంది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా కేంద్ర మంత్రి హోదాలో మర్రిశశిధర్ రెడ్డి పనిచేశారు. యూపీఏ హయంలో కాంగ్రెస్ పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత కల్పించిన ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉంటూ వచ్చారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆయనతో సన్నిహితంగా ఉండే నాయకుల్లో చాలామంది కాంగ్రెస్ పార్టీని వీడటం, ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు లేవనే అంచనాతోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కూడా మర్రి శశిధర్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు.