Man Murders Wife and Son: దారుణం.. గొడ్డలితో భార్యను నరికి, మూణ్నెళ్ల కొడుకుని సంపులో పడేసి హత్య!
15 March 2023, 16:35 IST
- Rangareddy district Crime News: అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో దారుణం వెలుగు చూసింది. భార్యను భర్త హత్య చేయటమే కాకుండా… కన్నబిడ్డను కూడా చంపేశాడు.
అనాజ్ పూర్ లో దారుణ ఘటన
Man murders wife and son at Anajpur: భార్య, భర్త... వారికి ఇద్దరు పిల్లలు..! నాలుగేళ్ల కిందట వీరి వివాహం జరిగింది. పాప మొదటి సంతానం కాగా... ఈ మధ్యనే బాబుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి ఇంటి వద్ద ఉన్న భార్యను ఇంటికి తీసుకొచ్చాడు భర్త. ఏకంగా గొడ్డలితో భార్యను హత్య చేశాడు. మూడు నెలలు ఉన్న కొడుకును నీటి సంపులో పడేశాడు. ఈ దారుణ ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం....రంగారెడ్డి జిల్లా బండరావిరాలకు చెందిన లావణ్యకు అనాజ్ పూర్ కి చెందిన ధనరాజ్తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉండగా.. ప్రస్తుతం బాబుకు జన్మనిచ్చింది. బాలింతగా ఉన్న లావణ్య(23) తల్లి ఇంటి వద్ద ఉంది. అయితే అక్కడ్నుంచి నిద్ర చేయడం కోసం భర్త ధనరాజ్ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన కాసేపటికే భార్యతో గొడవపడిన ధనరాజ్... గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత... మూడు నెలల కుమారుడిని నీటి సంపులో పడేసి చంపేశాడు.
తప్పించుకున్న కుమార్తె....
తల్లితో తండ్రి గొడవ పడుతున్న సమయంలో కుమార్తె ఆద్య(3) భయపడి ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. దీంతో ఆమె ప్రాణాలు కాపాడుకున్నట్లు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటానాస్థలికి చేరుకున్నారు. హత్యలకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.