Minister KTR : తెలంగాణలో మరో భారీ పెట్టుబడి, రూ.9500 కోట్ల అమరరాజా కంపెనీకి కేటీఆర్ శంకుస్థాపన
06 May 2023, 15:48 IST
- Minister KTR : మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద అమరరాజా లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అమరరాజా రాకతో మహబూబ్ నగర్ రూపురేఖలు మారాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు.
అమరరాజా కంపెనీ శంకుస్థాపన
Minister KTR : మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పథకాలు, కంపెనీలకు శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మిస్తున్న అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మంత్రి కేటీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అమరరాజా సంస్థ ప్రతినిధులు, మాజీ మంత్రి గల్లా అరుణ, ఎంపీ గల్లా జయదేవ్ పాల్గొ్న్నారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పరిశ్రమలకు ఊతమిస్తే అభివృద్ధి, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.
10 వేల మందికి ఉపాధి
లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్లో అమరరాజా దేశంలోనే అతి పెద్ద పెట్టుబడిని తెలంగాణలో పెడుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో అమరరాజా కంపెనీ రూ. 9500 కోట్ల పెట్టుబడి పెడుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్ ఐటీ రంగంలో 3 లక్షల 23 వేల మంది పనిచేస్తుంటే... నేడు దాదాపు 10 లక్షల మంది ప్రత్యక్షంగా పనిచేస్తున్నారన్నారు. ఒక ఐటీ కంపెనీ వస్తే దానికి అనుబంధంగా అనేత ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. అమరరాజా సంస్థ ఇక్కడ10 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. దీని వల్ల చుట్టు పక్కల ప్రాంతాల పరిస్థితి కూడా మెరుగుపడుతుందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. మరిన్ని పరిశ్రమలు ఈ ప్రాంతానికి వచ్చేందుకు మెగ్గుచూపుతాయన్నారు.
అనవసర పుకార్లు నమ్మొద్దు
జరిగే మంచికి విఘాతం కలిగించేందుకు అభివృద్ధి నిరోధకులు ఈ ప్రాంతం బాగు పడొద్దనే ఉద్దేశంతో పుకార్లు సృష్టిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరరాజా బ్యాటరీ పరిశ్రమతో కాలుష్యం వస్తుందని పుకార్లు సృష్టిస్తున్నారని తెలిపారు. అయితే లిథియం అయాన్ బ్యాటరీలను ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగిస్తారని తెలిపాకు. భవిష్యత్తులో పెట్రోల్, డిజీల్ వాహనాలను పక్కన పెట్టి అందరూ ఎలక్ట్రిక్ వాహనాలను వాడుతారన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీలను ఇక్కడ తయారుచేస్తారన్నారు. సంప్రదాయ బ్యాటరీల తయారీతో కొంత కాలుష్యం కలిగినా జీరో లిక్విడ్ డిశ్చార్జితో అంతర్జాతీయ ప్రమాణాలతో కంపెనీని ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. లిథియం అయాన్ బ్యాటరీలతో అసలు కాలుష్యం కూడా ఉండదన్నారు. అమరరాజా పెట్టుబడితో ఈ ప్రాంతం ముఖచిత్రం మారాలని కోరుకుంటున్నానని కేటీఆర్ అన్నారు.
పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ
ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తమ రాష్ట్రాల్లో కరెంటు, నీళ్లు, భూములు ఉన్నాయని, మంచి ప్రోత్సాహకాలు ఇస్తామని కంపెనీలను ఆహ్వానిస్తున్నారన్నారు. 27 సంవత్సరాల లోపు వయసు ఉన్న యువత దేశంలో 70 కోట్ల మంది ఉన్నారని, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు దొరకవు కాబట్టి, ఉపాధి కల్పించాలంటే ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించాలని కేటీఆర్ అన్నారు. పరిశ్రమలకు ఊతమిస్తేనే కొలువులు, సంపద వస్తాయన్నారు. ఆ సంపదను సంపదను పేదల సంక్షేమం కోసం వినియోగించవచ్చని తెలిపారు.