KTR On Modi: తీసుకునేది ఎక్కువ..ఇచ్చేది తక్కువ…తెలంగాణపై వివక్ష ఎందుకన్న కేటీఆర్
28 March 2023, 14:46 IST
KTR On Modi: తెలంగాణ నుంచి పన్నుల రూపంలో తీసుకునే ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర వాటాగా చెల్లించేది తక్కువని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా అడ్డంకులు కలిగిస్తోందన్నారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
KTR On Modi: హైదరాబాద్ వంటి నగరం ఎదగడం దేశానికి మంచిదని, హైదరాబాద్ వంటి నగరాలను ఎదగనివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తనతో కలిసి గుంటూరు వడ్లమూడిలో చదువుకున్న మిత్రుడు కెనడాలో స్థిరపడ్డారని, 16ఏళ్ల తర్వాత హైదరాబాద్ను చూసినవారు, కెనడా నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చేయాలనుకుంటున్నట్లు చెప్పాడనికేటీఆర్ వివరించారు. హైదరాబాద్ అభివృద్ధి చెందితే, తెలంగాణ అభివృద్ధి చెందినట్లు కాదా అని ప్రశ్నించారు.
తెలంగాణ నుంచి ఏటా 3.68లక్షల రుపాయలు పన్నులు కడితే 1.68లక్షల ఆదాయం మాత్రమే రాష్ట్ర వాటాగా వెనక్కి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. హైదరాబాద్తో పాటు గుంటూరు, విశాఖ, విజయవాడ కూడా అభివృద్ధి చెందుతున్నాయని, అభివృద్ధి విషయంలో తన వ్యాఖ్యలను అనవసరం వివాదం చేయొద్దన్నారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమన్నారు.తెలంగాణ అభివృద్ధి చెందకుండా రకరకాల అటంకాలు సృష్టిస్తోందని, మెట్రో ప్రాజెక్టుకు సైతం అనుతులు ఇవ్వలేదన్నారు.
మూడేళ్లలో శంషాబాద్ మెట్రో లైన్ పూర్తి….
మూడేళ్లలో శంషాబాద్ మెట్రో లైన్ పూర్తి చేస్తాం అని కేటీఆర్ ప్రకటించారు. లక్డీకాపూల్ – బీహెచ్ఈఎల్, నాగోల్ – ఎల్బీనగర్ రూట్లలో మెట్రోకు కేంద్రం సాయం కోరామని చెప్పారు. ఆ రెండు మార్గాల్లో మెట్రో ఫిజిబులిటీ లేదని కేంద్రం లేఖ రాయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ కట్టే పన్నుల్లో కూడా మనకు కేంద్రం మొండి చేయి చూపిస్తోందని ఆరోపించారు. యూపీ లాంటి రాష్ట్రాలకు మెట్రోలు ఇస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రజా రవాణాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, హైదరాబాద్లో మెట్రో లైన్ 250 కిలోమీటర్లకు విస్తరిస్తామన్నారు. ఇప్పటి వరకు చూసిన అభివృద్ధి గోరంత.. చేయాల్సింది చాలా ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
భాగ్యనగరంలో చెరువుల అభివృద్ధి….
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో జీహెచ్ఎంసీ పరిధిలోని 25, హెచ్ఎండీఏ పరిధిలోని 25 చెరువుల అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు పలు సంస్థలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులన్నింటినీ అన్ని రకాల అత్యాధునిక వసతులతో చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని చెరువులను అభివృద్ధి చేస్తున్నామని, కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని కేటీఆర్ తెలిపారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో జీహెచ్ఎంసీ పరిధిలోని 25, హెచ్ఎండీఏ పరిధిలోని 25 చెరువుల అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. హైదరాబాద్ నగరానికి 440 పైచిలుకు సంవత్సరాల చరిత్ర ఉందని, హైదరాబాద్లో 1908లో మూసీ నదికి వరదలు వచ్చిప్పుడు.. నాటి నిజాం మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిచి మాట్లాడారని, ఈ నగరం బాగుండాలంటే.. భవిష్యత్లో వరదల ముప్పు రాకుండా సమన్వయం చేయాలని ఇంజినీరింగ్ ప్రణాళిక ఇవ్వాలని విశ్వేశ్వరయ్యను కోరారని గుర్తు చేశారు. ఆ క్రమంలో వచ్చిందే హిమాయాత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువులని 1920లో గండీపేట్ పూర్తయినట్లు చెప్పారు. 94 శాతం నీళ్లు గ్రావిటీ ద్వారా మూసీలో కలుస్తున్నాయని తెలిపారు. జులై నాటికి హైదరాబాద్లో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేస్తామని, దేశంలోనే వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే నగరంగా హైదరాబాద్ నిలుస్తుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
దుర్గం చెరువుకు టూరిస్టుల తాకిడి..
ప్రస్తుతం హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్ గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో 155 చెరువులు ఉన్నాయని, దుర్గం చెరువు అభివృద్ధి చెందిన తర్వాత టూరిస్టులు అధికంగా వస్తున్నారన్నారు. సినిమా షూటింగ్లు కూడా చాలా జరుగుతున్నాయని, ఇటీవల హైదరాబాద్ సందర్శించిన వారు విదేశాల్లో ఉన్నామా అని ఆశ్చర్యపోతున్నారన్నారు. చెరువుల్లో ఉన్న ప్రైవేటు భూముల యజమానులకు మరో చోట భూమి ఇస్తున్నామని, టీడీఆర్ కింద 200 శాతం విలువ కల్పిస్తున్నామని చెప్పారు. 2000 సంవత్సరం నుంచి 5 దశల్లో చెరువుల శాటిలైట్ మ్యాప్స్ తీశామని వివరించారు. చెరువుల అభివృద్ధిలో రియల్టర్లను భాగస్వాములను చేస్తున్నాం. పక్కా ప్లాన్ రూపొందించి అమలు చేయాలని కేటీఆర్ సూచించారు.
ఆఫీస్ స్పేస్ ఆక్యుపేషన్లో దేశంలోనే హైదరాబాద్ నెంబర్ వన్గా నిలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఎంతో కృషి చేస్తే తప్ప ఇంత అభివృద్ధి జరగదు. ప్రపంచానికే వ్యాక్సిన్ క్యాపిటల్గా హైదరాబాద్ మారిందని, ఫార్మా సిటీ ప్రారంభమైతే ప్రపంచ ఫార్మా నగరంగా మారుతుందన్నారు. శాంతిభద్రతలు, పరిపాలన బాగుండటం వల్లే భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. 2030 కల్లా 250 బిలియన్ డాలర్ల స్థాయికి హైదరాబాద్ ఫార్మా ఇండస్ట్రీ చేరుతుందన్నారు. హైదరాబాద్లో వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీని రాచకొండలో నిర్మిస్తామని, ఒలింపిక్స్ స్థాయి స్పోర్ట్స్ సిటీ కూడా నిర్మిస్తామన్నారు. హైదరాబాద్లో మరిన్ని ఐకానిక్ భవనాలు రావాల్సిఉందన్నారు.