KTR : పరిశ్రమలలో తెలంగాణ ఫస్ట్.. భాషతో ప్రతిభను అంచనా వేయోద్దు
04 July 2022, 21:53 IST
- పరిశ్రమల విషయంలో అంతకుముందు గుజరాత్ మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాలు ముందు వరుసలో ఉండేవని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు.
మంత్రి కేటీఆర్
సులభతర వాణిజ్యంలో ఎక్కువసార్లు తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని కేటీఆర్ అన్నారు. దేశంలో ప్రాంతాలను బట్టి ఆయా భాష మాట్లాడుతుంటారని పేర్కొన్నారు. భాషను ఆధారంగా ప్రతిభను అంచనా వేయవద్దని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. పలు రంగాల్లో రాణిస్తున్నవారికి కేటీఆర్ అవార్డులు అందజేశారు. మొత్తం 19 కేటగిరీల్లో అవార్డులు ఇచ్చారు.
'వ్యాపార రంగం విషయంలో ప్రభుత్వ జోక్యం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టీఎస్ఐపాస్లో కీలక నిబంధనలు పొందుపరిచాం. సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం మాదిరిగా పెట్టుబడిదారులకు ఇక్కడ స్వీయధ్రువీకరణ హక్కు కల్పించాం. నిబంధనల ప్రకారం.. మా వ్యాపారం మేం చేసుకుంటామని ఎవరైనా స్వీయధ్రువీకరణ ఇస్తే.. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు అవసరం లేకుండా మొదటి రోజు నుంచే పరిశ్రమలను ప్రారంభించుకోవచ్చు. ఈ విషయాన్ని దేశంలో ఏ రాష్ట్రం చెప్పదు. ప్రభుత్వ మద్దతు అంటే ఈ తరహా సాధికారతను కల్పించడమే. ప్రభుత్వ జోక్యం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది.' అని కేటీఆర్ అన్నారు.
టూరిజం పురస్కారం అందుకున్న లక్ష్మీకాంతం
ఆధ్యాత్మికత చాటిచెప్పేందుకు ఎంతగానో కృషి చేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం.. అవార్డు అందుకున్నారు. సురేంద్రపురి మ్యూజియం డైరెక్టర్ గా ఆయన చేస్తున్న కృషికిగానూ.. తెలంగాణ టూరిజం ఎక్స్లెన్స్ ప్రమోషన్ పురస్కారం వరించింది. హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. యాదగిరిగుట్ట సమీపంలో ఉన్న సురేంద్రపురి పర్యాటకులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తోంది. భారతదేశంలోని పురాణ ప్రాముఖ్యం కలిగిన సన్నివేశాలు, పురాతన ప్రాముఖ్యం ఉన్న దేవాలయాల నమూనాలను శిల్పాలుగా చేసి చూపిస్తున్నారు.