TS Govt : చేతి వృత్తుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయం, ఎవరు అర్హులంటే?
06 June 2023, 21:36 IST
- TS Govt : బీసీల్లో వెనుకబడిన చేతివృత్తులు, కుల వృత్తుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం విధివిధానాలను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేసింది.
సీఎం కేసీఆర్
TS Govt : తెలంగాణలోని బీసీ చేతి, కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థికసాయం అందించాలని ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, శాలివాహన కుమ్మరి, మేదరి తదితర కులవృత్తుల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమం విధివిధాలను మంత్రి వర్గ ఉపసంఘం ఖరారు చేసింది. ఏ కులాలను పరిగణనలోకి తీసుకోవాలి, నగదును సొమ్ము సాయంగా ఇవ్వాలా, సబ్సిడీగా ఇవ్వాలా అనే అంశాలపై మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేశారు. మంత్రులు తలసాని, శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్ రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
విధివిధానాలు ఖరారు
మంత్రి వర్గ ఉప సంఘం బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి అందించే ఆర్థిక సాయానికి విధివిధానాలను ఖరారు చేసింది. అర్హులైన కుటుంబంలో ఒకరికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. గ్రామాల్లో రూ.1.50 లక్షల లోపు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఈ పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు గల వారు మాత్రమే అర్హులని తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన వెబ్సైట్ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఆర్థిక సాయం కోసం పొందేందుకు https://tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. ఫొటో, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్ 9న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో అర్హులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
ఈనెల 6 నుంచి 20 తేదీ వరకు గడువు
బీసీ కులవృత్తులు నిర్వహించుకునే చేతివృత్తిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లక్ష రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన విధివిధానాలతో పాటు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి నేటి నుంచి అవకాశం ఇస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాలలో లాంఛనంగా ప్రారంభిస్తున్నామన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయంలో వెబ్ సైట్ ను లాంచ్ చేశారు. ఈనెల 6 నుంచి 20 తేదీ వరకూ https://tsobmmsbc.cgg.gov.in వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలన్నారు. చేతివృత్తిదారుల జీవితాలలో వెలుగులు నింపి, వారి ఆర్థిక భరోసాను అందించడంతో పాటు గౌరవప్రదమైన జీవనం కొనసాగించేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకం తీసుకొచ్చారన్నారు. ఈ పథకం ద్వారా చేతి వృత్తుల కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబనకు అవకాశం ఏర్పడుతుందన్నారు. లబ్దిదారులు వృత్తి పనిముట్లు, ముడిసరుకు కొనడానికి ఈ నిధులు ఉపయోగపడుతాయన్నారు. దీని ద్వారా లబ్దిదారులు ఆర్థిక స్వావలంబన సాధించడంలో అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు.