Warangal: నాన్న తెచ్చిన విదేశీ చాక్లెట్లు... 8 ఏళ్ల బాలుడి ప్రాణం బలి
27 November 2022, 10:54 IST
- Eight Years Boy Died in Warangal: వరంగల్ సిటీలోని పిన్నవారి వీధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని 8 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
చాక్లెట్ తిని 8 ఏళ్ల బాలుడి మృతి
Boy dies after a chocolate stuck in Throat: భార్య, భర్త... వారికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. వరంగల్ నగరంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల తండ్రి ఆస్ట్రేలియాకు వెళ్లి వచ్చాడు. వస్తూ వస్తూ పిల్లల కోసం చాకెట్లు తీసుకువచ్చాడు. ఇక స్కూల్ కి వెళ్లేముందు పిల్లలకు చాకెట్లు ఇచ్చింది తల్లి. సీన్ కట్ చేస్తే...వీరిలో ఓ బాలుడి ప్రాణం పోయింది. ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. అసలేం జరిగిందంటే....
గొంతులో ఇరుక్కొని...
రాజస్తాన్కు చెందిన కన్గహాన్ సింగ్ వరంగల్ సిటీలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఓ ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తున్నాడు. అతడిని భార్య గీత, ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. పిల్లలు పిన్నవారి వీధిలో ఓ స్కూల్లో చదువుతున్నారు. రోజు మాదిరిగానే శనివారం కన్గహాన్ సింగ్ పిల్లలను స్కూల్ వద్ద దింపాడు. అయితే స్కూల్కు బయలుదేరే సమయంలో ఇటీవల విదేశాల నుంచి తీసుకొచ్చిన చాక్లెట్స్ను తల్లి.. పిల్లలకు ఇచ్చింది. అయితే వీరి రెండో కొడుకు సందీప్ చాక్లెట్ తింటూ స్కూల్లోకి అడుగుపెట్టాడు. మొదటి అంతస్తులోని తన క్లాస్ రూమ్కి చేరుకున్న కాసేపటికే... స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్కూల్ యజమాన్యం ఆస్పత్రికి తరలించింది. అప్పటికే పరిస్థితి విషమించటంతో బాలుడు మృతి చెందాడు. గొంతులో చాక్లెట్ ఇరుక్కొవటమే ఇందుకు కారణమని తేల్చారు. చాక్లెట్ ఇరుక్కొవడంతో శ్వాస అందక సందీప్ చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు.
తమ కళ్ల ముందే సంతోషంగా బడికి వెళ్లిన కుమారుడు...విగతజీవిగా మారటాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది.