Jagga reddy: ఒవైసీ… దమ్ముంటే మెదక్ నుంచి పోటీ చేయ్.. నేను హైదరాబాద్ నుంచి చేస్తా
21 May 2022, 23:13 IST
- టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. వీరి మధ్య రాజకీయ అక్రమ సంబంధం కొనసాగుతుందని విమర్శించారు. అసదుద్దీన్ ఒవైసీకి దమ్ముంటే మెదక్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు.
టీఆర్ఎస్, బీజేపీ మధ్య అండర్స్టాండింగ్ రాజకీయం నడుస్తోంది - జగ్గారెడ్డి
తెలంగాణలో బిజినెస్ పాలన నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. శనివారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలపై మండిపడ్డారు. బీజేపీ డైరెక్షన్ లోనే కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం అంతర్గతంగా అండర్ స్టాండింగ్తో ముందుకు వెళ్తున్నాయని దుయ్యబట్టారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేసేందుకుఈ మూడు పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒవైసీకి సవాల్...
తెలంగాణ టూర్ కు వచ్చిన రాహుల్ పై ఒవైసీ పలు వ్యాఖ్యలు చేయటాన్ని జగ్గారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. హైదరాబాద్ ఎంపీ సీటుకు రాహుల్ పోటీ చేయాలంటూ అసదుద్దీన్ చేసిన సవాల్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.హైదరాబాద్లో పోటీకి రాహుల్ అవసరం లేదు.. తానే వస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ గనుక అవకాశం ఇస్తే.. హైదరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిస్తానని స్పష్టం చేశారు. మరి మెదక్ నుంచి పోటీ చేసే దమ్ము ఉందా? అని అసదుద్దీన్ను సూటిగా ప్రశ్నించారు. అసలు అసదుద్దీన్ ఏనాడైనా ప్రజాపోరాటలు చేశారని అని నిలదీశారు. ముస్లిం రిజ్వరేషన్లపై కేసీఆర్ తో ఎప్పుడైనా కొట్టాడారా అంటూ దుయ్యబట్టారు.