Bandi Sanjay Yatra : ఇంటికో ఉద్యోగం కేసీఆర్ ఫ్యామిలీకే దక్కిందన్న బండి సంజయ్..
13 September 2022, 14:12 IST
- మంచి ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తోందని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చెప్పారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా రెండో రోజు యాత్రను బండి సంజయ్ కొనసాగిస్తున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, 1400 మంది అమరుల త్యాగాలతోనే రాష్ట్రం ఏర్పడిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, కెసిఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలను ప్రజలు తమతో చెప్పుకున్నారని వివరించారు. ఈ ప్రాంతంలో నిలువు నీడలేని పేదలు ఎందరో ఉన్నారని, కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారో ఇక్కడ గెలిచిన నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీ ఏమయ్యాయని ప్రశ్నించారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, తన కుటుంబానికి మాత్రమే కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. కుత్బుల్లాపూర్ ప్రాంత టిఆర్ఎస్ నాయకులు దమ్ముంటే ప్రగతి భవన్ కు పోయి కెసిఆర్ ఇచ్చిన హామీలను ప్రశ్నించాలని సవాల్ చేశారు. తెలంగాణలో దళితుడుని సీఎం చేశారా?, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, దళిత బంధు హామీ నెరవేర్చారో లేదో నిలదీయాలన్నారు. కుత్బుల్లాపూర్లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం ఏమైందన్నారు. కుత్బుల్లాపూర్ ఒక మినీ భారత్ లాంటిదని, కుత్బుల్లాపూర్ లో బస్సు డిపో ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు.
ఈ ప్రాంతంలో మంచినీళ్లలో... మురుగు నీరు కలుస్తున్నా పట్టించు కోవట్లేదని ఆరోపించారు. స్థానికంగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని, మోకాళ్ళ ఎత్తున మురుగు ప్రవహిస్తోందన్నారు. కుత్బుల్లాపూర్ లో భూములు, నాలాలను కబ్జా చేశారని, ప్రజలు కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించని ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆరోపించారు.
కేసీఆర్కు మనసు లేదు….
సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న వీఆర్ఏలపై లాఠీ ఛార్జ్ చేసి, కాళ్లు విరగ్గొడుతున్నారని ఆరోపించారు. వీఆర్ఏలు పేదోళ్లని, వాళ్లను కొట్టించడానికి నీకు చేతులెట్లా వచ్చినాయని ప్రశ్నించారు. కేసీఆర్ మనసులేని దుర్మార్గుడని మండిపడ్డారు. వీఆర్ఏలకు అసెంబ్లీలో ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నా, ఎందుకు చేయడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని బిజెపి డిమాండ్ చేస్తుందన్నారు. తెలంగాణలో పేదోళ్ల రాజ్యం రావాలని, విద్యుత్ బిల్లులను ఇష్టం వచ్చినట్టు పెంచారని ఆరోపించారు. సంవత్సరానికి రూ. 6 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా తెలంగాణలో కరెంటు చార్జీలను పెంచారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు.