CM KCR | సీఎం కేసీఆర్ పై బీజేపీ నేతల ఫిర్యాదు.. పోలీస్ కేసు నమోదు!
15 February 2022, 15:58 IST
సీఎం కేసీఆర్ పై పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. సర్టికల్ స్టైక్ కు సంబంధించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)
ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్ పై కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన ఫ్రూప్ కావాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై అసోం బీజేపీ నేతలు కేసీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు అసోం పోలీసులు కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రముఖ వార్త ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది.
కేసీఆర్ అప్పుడు ఏం మాట్లాడారంటే..
ఇటీవలే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీని ఈ దేశం నుంచి తరిమికొట్టేందుకు అన్ని శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. సమాజం నాశనమవుతుందని అన్నారు. సుమారు రెండు గంటలపాటు మీడియాతో మాట్లాడారు. కర్నాటకలో హిజాబ్ రోజ్ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణల అంశం వరకు ప్రస్తావించారు. ఎన్నికల ముందు కాషాయ పార్టీ కావాలనే.. ఉద్రిక్తతలు సృష్టిస్తోందని ఆరోపించారు.
రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఖండించారు. బీజేపీ సీఎం చేసిన వ్యాఖ్యలకు ప్రధాని సంతోషిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సర్జికల్ స్టైక్స్ పై కేసీఆర్ మాట్లాడారు. సర్జికల్ స్ట్రైక్స్కు సంబంధించి రాహుల్ గాంధీ ఆధారాలు అడగడంలో తప్పులేదని.. కేసీఆర్ పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ అనే అంశాన్ని రాజకీయ మైలేజీ కోసమే బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. అలాంటి సందేహాలే అందరికీ ఉన్నాయన్నారు. ఆధారాలు అడగడంలో తప్పేమీ లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
రాఫెల్ డీల్లో వేల కోట్ల అవినీతి జరిగిందనీ, అవినీతిపై న్యాయస్థానాల్లో పోరాడతామని అదే రోజు కేసీఆర్ చెప్పారు. అవినీతి కుంభకోణాలు బయటకు రావాలన్నారు. యూపీ ఎన్నికలు పూర్తయ్యాక ఇంధన ధరలు పెంచుతారని కేసీఆర్ అన్నారు.
కేసీఆర్ పై బీజేపీ నేతల ఫైర్
అయితే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మరోవైపు బీజేపీ మండిపడుతోంది. దేశ రక్షణలో భాగంగా జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడి.. జవాన్ల ఆత్మస్థైర్యాన్ని కేసీఆర్ దెబ్బతిస్తున్నారని ఆరోపిస్తుంది. కొత్త రాజ్యాంగం తేవాలని చెప్పి.. తరతరాలు పాలించాలనుకుంటున్నట్టు కేసీఆర్ పై కిషన్ రెడ్డి కామెంట్స్ చేశారు. ప్రత్యర్థి పార్టీలను ఎప్పుడూ శత్రువులుగా చూడొద్దని హితవు పలికారు. సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో గన్పార్కు వద్ద మోడీ ప్రభుత్వం ఏడేళ్ల పాలనపై కేసీఆర్తో చర్చకు రెడీగా ఉన్నామని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం సవాల్ను కేంద్ర ప్రభుత్వం తరఫున సవాల్ స్వీకరిస్తున్నానని ప్రకటించారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకురావాలని చూస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.