తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak News : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టెన్త్ విద్యార్థికి 6.7 జీపీఏ-తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు

Medak News : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టెన్త్ విద్యార్థికి 6.7 జీపీఏ-తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు

HT Telugu Desk HT Telugu

Published Apr 30, 2024 09:08 PM IST

google News
    • Medak News : మెదక్ జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 ఏళ్ల అఖిల్ మృతి చెందాడు. ఇవాళ విడుదలైన పదో తరగతి ఫలితాల్లో అఖిల్ 6.7 GPA సాధించాడు. ఈ ఫలితాలను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టెన్త్ విద్యార్థికి 6.7 జీపీఏ

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టెన్త్ విద్యార్థికి 6.7 జీపీఏ

Medak News : తమ కన్నకొడుకు పదో తరగతి(TS SSC Results)లో మంచి మార్కులతో పాస్ అయ్యాడంటే, అందరు తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. తమ కుమారుడు 6.7 GPA తో పాస్ అయినా విషయం తెలిసిన ఆ తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఎందుకంటే, ఆ ఫలితాలు వారి కుమారుడు చనిపోయిన తరవాత వెలువడ్డాయి. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లికి చెందిన అంబర్ పేట అఖిల్ (15) అనే బాలుడు చందాయిపేట జడ్పీ హైస్కూల్ లో పదో తరగతి పూర్తి చేశాడు. మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. అఖిల్ ఏప్రిల్ 2 న తన చివరి పరీక్ష రాశాడు.


పెదనాన్న కూతురు పెళ్లికి బట్టలు కొనటానికి వెళ్తూ

అఖిల్ పెద్దనాన్న కుమార్తె పెళ్లి ఏప్రిల్ 24న ఉండటంతో.. ఏప్రిల్ 15న రోజు పెళ్లి బట్టలు కొనాలని కుటుంబ మొత్తం దగ్గర్లో ఉన్న తూప్రాన్ పట్టణానికి బయలుదేరింది. అఖిల్ తండ్రి బాలకృష్ణ, తూప్రాన్, చందాయిపేట మధ్య సొంత ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అదే ఆటోలో, బాలకృష్ణ, తన భార్య రాధా, అఖిల్, మిగతా కుటుంబ సభ్యులు కలసి, తూప్రాన్ కు బయలుదేరారు. తూప్రాన్ పట్టణం దగ్గర్లోని నాగులపల్లి చౌరస్తా వద్దకు రాగానే, హైవే మీద అతివేగంగా వచ్చిన ఒక కారు వీరి ఆటోని బలంగా(Accident) ఢీకొట్టింది. ఆటోలో నుంచి కిందపడిపోయిన అఖిల్ తల మీద నుంచి కారు వెళ్లటంతో, అతను అక్కడికక్కడే మరణించాడు. మిగిలిన కుటుంబ సభ్యులు గాయాలతో బయటపడ్డారు. అఖిల్ చనిపోవడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు కుటుంబసభ్యులు.

మ్యాథమెటిక్స్ లో 9 GPA

ఇవాళ పదో తరగతి ఫలితాలు(TS 10th Results) విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో తమ కుమారుడు 6.7 GPA తో ఉత్తీర్ణత సాధించాడని తెలుసుకుని అఖిల్ తల్లిదండ్రులు బోరున విలపించారు. మ్యాథమెటిక్స్(Mathematics) లో అఖిల్ 9 GPA సాధించాడు. ఇప్పుడు తమ కుమారుడు బతికి ఉంటే చాలా సంతోషపడేవాడని, తన స్నేహితులదరీ స్నేహితుల మాదిరిగా కళాశాలలో చేరే వాడని కన్నీరుపెట్టుకున్నారు.

పదో తరగతి ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాకు 5వ స్థానం

పదో తరగతి ఫలితాల్లో(TS SSC Results 2024) 2023-24 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో సంగారెడ్డి(Sangareddy) జిల్లా 5వ స్థానంలో నిలిచిందినందుకు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సంతోషం వ్యక్తం చేశారు. మెరుగైన ఫలితాలు సాధించినందుకు జిల్లా విద్యాధికారి, సిబ్బందికి అభినందనలు తెలిపారు.