India vs Australia 1st Test: నాగ్పూర్ చేరుకున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో టెస్టుకు సమాయత్తం
02 February 2023, 22:37 IST
- India vs Australia 1st Test: ఆస్ట్రేలియాతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్కు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9 నుంచి జరగనున్న తొలి టెస్టు కోసం భారత జట్టు నాగ్పూర్కు చేరుకుంది.
నాగ్పూర్ కు చేరుకున్న భారత జట్టు
India vs Australia 1st Test: న్యూజిలాండ్తో వన్డే, టీ20 సిరీస్ తర్వాత భారత్.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు సమాయాత్తమవుతోంది. ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు నాగ్పుర్ వేదిక కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్స్ ఫైనల్స్లో టీమిండియా అవకాశాలు సన్నగిల్లకుండా ఉండాలంటే ఈ సిరీస్ తప్పకుండా గెలవాలి. దీంతో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా భారత జట్టు తొలి టెస్టు కోసం నాగ్పుర్ చేరుకుంది.
మహమ్మద్ సిరాజ్ సహా పలువురు ఆటగాళ్లు నాగ్పుర్ చేరుకున్నారు. రవీంద్ర జడేజాతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ నాగ్పుర్ విమానాశ్రయంలో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.
ఈ టెస్టుకు రవీంద్ర జడేజా పునరాగమనం చేసే అవకాశం కనిపిస్తోంది. చాలా కాలం గ్యాప్ తర్వాత అతడు జట్టులోకి రానున్నాడు. ఇటీవల రంజీ సీజన్లోనూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్లతో రాణించాడు.
విరాట్ కోహ్లీ, శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్తో పాటు జడేజా చేరిక కూడా భారత జట్టుకు మరింత బలం చేకూరనుంది. ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్ లాంటి పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా.. భారత్తో టెస్టు మ్యాచ్ల్లో రాణించలేకపోయింది. గత రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను చేజార్చుకుంది. దీంతో ఈ సిరీస్తో పుంజుకోవాలని చూస్తున్నారు.