IND Vs SL : ట్రైనింగ్లో రోహిత్ శర్మ.. శ్రీలంక సిరీస్కు రెడీ అవుతున్నాడా?
27 December 2022, 20:11 IST
- Rohit Sharma Fitness : రోహిత్ శర్మ మళ్లీ ట్రైనింగ్ మెుదలుపెట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేశాడు. దీంతో శ్రీలంకతో సిరీస్ కు రోహిత్ రెడీ అవుతున్నాడని చర్చ మెుదలైంది.
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ(Rohit Sharma) ట్రైనింగ్ లోకి దిగాడు. దీంతో శ్రీలంకతో సిరీస్ కు రెడీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్తో ఆడే సమయంలో రెండో వన్డేలో స్లిప్స్లో ఉన్న బంతిని రోహిత్ క్యాచ్ చేసేందుకు ప్రయత్నించాడు. అతడి బోటన వేలుకు గాయమైంది. జట్టు కష్ట సమయంలో వచ్చాడు.. దీంతో గాయం మరింత ఎక్కువైంది. మూడో వన్డేలో ఆడలేదు. రోహిత్ బొటన వేలికి గాయం కావడంతో కోలుకోవడానికి ముంబై వెళ్లినట్లు బీసీసీఐ(BCCI) తెలిపింది. KL రాహుల్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ను భారత్ గెలుచుకుంది.
గాయం ఇంకా పూర్తిగా తగ్గలేదని టెస్టు సిరీస్ ఆడితే అది మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉందని బీసీసీఐ భావించింది. ఆ సిరీస్ నుంచి రోహిత్ను తప్పించింది. అయితే తాజాగా రోహిత్ పెట్టిన పోస్ట్ తో శ్రీలంక సిరీస్(Sri Lanka Series)కు వెళ్లే అవకాశాలు ఉన్నాయా అనిపిస్తుంది.
Getting There.. అని రోహిత్ తన ఇన్స్టాగ్రామ్(Instagram)లో రన్నింగ్ చేస్తున్న ఫొటోను షేర్ చేశాడు. రోహిత్ శిక్షణకు తిరిగి వచ్చాడు. అయితే అతను శ్రీలంక T20కి వచ్చే అవకాశం ఉందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. రెండు రోజుల క్రితం PTI చేప్పిన నివేదిక ప్రకారం, రోహిత్ బొటనవేలు ఇంకా నయం కాలేదు. సరిగ్గా బ్యాటింగ్ చేయగలడు. కానీ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆందోళన చెందుతున్నందున జట్టు మేనేజ్మెంట్ రిస్క్ చేయదు అని తెలిపింది.
మరోవైపు జనవరి 3 నుంచి శ్రీలంకతో టీమిండియా(Team India) టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. అనంతరం మూడు వన్డెలు కూడా ఆడనుంది. టీ20 సిరీస్ జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా అంటూ వార్తలు వచ్చాయి. అయితే శ్రీలంకకు రెండు బృందాలను చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ(Selection Committee) ఎంపిక చేస్తుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. రోహిత్ గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్లోకి దిగినట్టుగా రోహిత్ తన ఇన్స్టాగ్రాంలో ఫొటోలు షేర్ చేశాడు. దీంతో భారత క్రికెట్ లవర్స్.. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.