Dinesh karthik: దినేష్ కార్తీక్ సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పిన మాజీ సెలక్టర్!
01 August 2022, 15:01 IST
- Dinesh karthik: రిటైర్మెంట్ వయసులో మళ్లీ టీమిండియాలోకి వచ్చి.. ఇప్పుడు గొప్ప ఫినిషర్గా మారాడు దినేష్ కార్తీక్. ఎంతో టాలెంట్ ఉన్నా కూడా ఇన్నాళ్లూ అతడు ఎందుకు విఫలమయ్యాడు?
దినేష్ కార్తీక్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ అంతా అయిపోయిందనుకున్న దినేష్ కార్తీక్ కెరీర్ను మలుపు తిప్పింది. అతన్ని మళ్లీ టీమిండియాలోకి తీసుకురావడమే కాదు.. టీ20 వరల్డ్కప్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడన్న రేంజ్కు తీసుకెళ్లింది. మొన్న వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లోనూ కార్తీక్ మరోసారి తానేంటో చూపించాడు. స్లాగ్ ఓవర్లలో వచ్చి కేవలం 19 బాల్స్లోనే 41 రన్స్ చేసి టీమ్ భారీ స్కోరుకు కారణమయ్యాడు.
మరి గతంలో అతడు ఎందుకిలా ఆడలేకపోయాడు. దీనికి సమాధానం చెప్పాడు టీమిండియా మాజీ వికెట్ కీపర్, మాజీ సెలక్టర్ సబా కరీమ్. ప్రస్తుత టీమ్ మేనేజ్మెంట్ కార్తీక్కు తన రోల్ ఏంటో చెప్పడం వల్లే అతడు ఇంత అద్భుతంగా ఆడుతున్నాడని కరీమ్ అన్నాడు. కార్తీక్ ఏ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినా అతడు మూడు లేదా నాలుగు ఓవర్లు ఆడాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోందని అతడు చెప్పాడు.
"రెండేళ్ల కిందట దినేష్ కార్తీక్ బ్యాటింగ్ ఆర్డర్లో పైన వచ్చినప్పుడు అతడు ఎందుకు ఆడలేకపోతున్నాడన్నది మాకు అర్థం కాలేదు. తన రోల్పై అతనికి అప్పుడు క్లారిటీ లేదు. అతనికి ఎప్పుడు పెద్ద షాట్లు ఆడాలి, ఎప్పుడు సింగిల్స్ తీయాలో తెలియలేదు. కానీ ఇప్పుడు అతనికి స్పష్టమైన రోల్ ఉంది. అందుకే అతని ఆట ఎంతో మెరుగైంది" అని సబా కరీమ్ అన్నాడు.
"టీమ్ మేనేజ్మెంట్ అతని పాత్రేంటో స్పష్టంగా చెప్పింది. అలాంటి పరిస్థితుల్లోనే ప్రతిసారీ అతన్ని పంపుతోంది. అతడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడన్నదానితో సంబంధం లేకుండా అతడు మూడు లేదా నాలుగు ఓవర్లు ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్లాన్ ప్రకారమే అతడు సిద్ధమయ్యాడు. అందుకే సక్సెస్ అవుతున్నాడు" అని కరీమ్ స్పష్టం చేశాడు.
టీ20 ఫార్మాట్ కార్తీక్కు బాగా సూటవుతుందని కూడా అతడు చెప్పాడు. ఎందుకంటే టీ20ల్లో ఓవర్లతో పని లేదని, ఎన్ని బాల్స్ ఆడతారన్నదే ముఖ్యమని కరీమ్ అన్నాడు. టీమ్ వ్యూహాలు సిద్ధం చేసే సమయంలోనే ఏ బ్యాటర్ ఎన్ని బాల్స్ ఆడాలన్నదానిపై దృష్టిసారిస్తారని చెప్పాడు. కార్తీక్ రోల్ చివర్లో వెళ్లి, ఆ రెండు మూడు ఓవర్లలో భారీగా రన్స్ చేయడమేనని తెలిపాడు.