ప్రభుత్వ బడిలో చదివితే రూ. 1000.. స్టాలిన్ సర్కార్ మరో పథకం
19 March 2022, 12:51 IST
- తమిళనాడులోని సర్కార్... మరో కొత్త పథకానికి నాంది చుట్టింది. బాలికల విద్యను ప్రోత్సహించడానికి వారికి నెలకు రూ.1000 అందించనుంది. ఈ మేరకు శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ పథకాన్ని ప్రకటించింది.
తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న స్టాలిన్ సర్కార్.. మరో వినూత్న పథకం తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లోని చదువుతున్న బాలికల కోసం కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టింది.
ప్రతి నెల విద్యార్థుల ఖాతాలో వెయ్యి రూపాయలు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంతో సుమారు 6 లక్షల మంది బాలికలు లబ్ధిపొందనున్నారు. శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్దెట్ లో ఈ వివరాలను వెల్లడించారు. ఈ పథకం కోసం రూ. 600 కోట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు,
ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలు ఈ పథకానికి అర్హులు. డిగ్రీ, డిప్లోమా, ఐటీఐ.. పూర్తి చేసే వరకు ఈ డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల నమోదు నిష్పత్తి తక్కువగా ఉందని గుర్తించిన ప్రభుత్వం.. ఈ నిర్ణయం తీసుకుంది. స్టాలిన్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.